కత్తి దాడి ఘటనపై అనవసర రాద్దాంతం వద్దు...జగన్ కు ఆ అవసరం ఉందా?:ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
రాజమండ్రి:జగన్పై కత్తి దాడి ఘటనపై మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత, వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆనందం ఎందుకని ఉండవల్లి ప్రశ్నించారు.
జగన్పై హత్యాయత్నం జరిగిన తర్వాత చంద్రబాబు ప్రెస్మీట్లో నవ్వుతూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కత్తి దాడి నిందితుడు శ్రీనివాస్ కు నార్కోఎనాలసిస్ టెస్ట్ చేయించాలని...దీంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఉండవల్లి సూచించారు. అంతే తప్ప ఈ విషయంలో అనవసర రాద్దాంతం చేయడం మానుకోవాలని హితవు పలికారు.
చంద్రబాబు...అతిగా స్పందించారు
ముఖ్యంగా జగన్పై దాడి ఘటనలో సిఎం చంద్రబాబు చాలా అతిగా స్పందించారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ కుటుంబానికి డ్రామాలంటే ఇష్టం ఉండదని ఉండవల్లి అన్నారు. అసలు జగనే కావాలనే చేయించుకున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించడాన్ని ఉండవల్లి తప్పుబట్టారు. అలా కావాలనే హత్యాయత్నం చేయించుకోవాల్సిన అవసరం జగన్ కు ఏముందని ఉండవల్లి ప్రశ్నించారు. ఆ అభిమాని ఏ పార్టీకి చెందినవాడో త్వరలోనే తెలుస్తుందన్నారు.
పోలవరంలో...అలాగే జరుగుతోంది
రాష్ట్రంలో ఐటీ దాడుల తర్వాతే చంద్రబాబు వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి పెద్దఎత్తున కట్టుదిట్టంగా జరుగుతోందన్నారు. పోలవరం విషయంలో తాను గతంలో ఏదైతే చెప్పానో అదే జరుగుతుందని ఉండవల్లి స్పష్టం చేశారు. ‘పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి జెట్ గ్రౌటింగ్ పూర్తయిందని ప్రకటించారు...అది కాస్తా వర్షాలకు కొట్టుకుపోయిందని మళ్లీ వాళ్లే చెప్పారని వెల్లడించారు. టీడీపీ అనుకూలమైన ఒక పేపర్ లోనే దీనిపై కథనం కూడా వచ్చిందని ఉండవల్లి గుర్తుచేశారు.
ప్రభుత్వాలు...నిజాలు చెప్పాలి
"జెట్ గ్రౌటింగ్ అసలు అంచనాల్లోనే లేదు..ఎంత చెల్లించాలో కూడా తెలియదని చెప్పింది. పూర్తయిన తర్వాత కాంట్రాక్టర్లు ఎంత చెబితే అంత చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. పోలవరం విషయంలో బిల్లులు అసలు కంటే ఎక్కువగా చెల్లిస్తున్నారని ముందే చెప్పాను...అదే విషయం కాగ్ తేల్చింది. 2019లో మే నాటికి నీరిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే మేలో నీరుండదు. నిజాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది"...అని ఉండవల్లి తెలిపారు.
అన్నీ...తాత్కాలికాలే
కాంట్రాక్టర్లకు అధిక మొత్తాల్లో సొమ్ము ఇచ్చి పనిచేయిస్తున్నప్పుడు మళ్లీ నాణ్యత విషయంలో ఎందుకు రాజీ పడుతున్నారని ఉండవల్లి ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజధానిలో చేపట్టిన నిర్మాణాలన్నీ తాత్కాలికమేనని, శాశ్వత కట్టడం ఒక్కటి కూడా లేదని ఉండవల్లి స్పష్టం చేశారు. ఆఖరికి హైకోర్టు భవనం కూడా తాత్కాలికంగానే ఏర్పాటు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయితే బీజేపీ కూడా ఈ తాత్కాలిక భవనాలు నిర్మించేటపుడు టీడీపీని ప్రశ్నించలేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఇవన్నీ కూడా టీడీపీ, బీజేపీలు 4 సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలేనని అన్నారు. రాజకీయాలు కూడా ఓ వృత్తిలా మారిపోయాయని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.