రాజధానిపై సీఎం జగన్ బ్లండర్.. చంద్రబాబుకు భిన్నంగా ప్లానేది? ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
ఒక రాష్ట్ర రాజధానికి సంబంధించి ఇప్పటిదాకా ఇలాంటి సదర్భమేదీ దేశంలో రాలేదు కాబట్టే అమరావతిపై భయంకరమైన గందరగోళం నెలకొందని, ఏనాడూ తలెత్తలేదు కాబట్టే ఈ వివాదంపై అసలు చట్టాలు, నిబంధనలు ఏం చెబుతన్నాయనేది ఆసక్తికరంగా మారిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాజధాని విషయంలో ప్రస్తుత సీఎం జగన్.. మాజీ సీఎం చంద్రబాబు లాగే బ్లండర్స్ చేస్తున్నారని, పెద్ద సిటీ కావాలన్నది ఇద్దరి వాదనలోనూ ప్రధానాంశమని, అయితే ఆ విషయాన్ని చెబుతున్న తీరు, అనుసరిస్తున్న స్టైల్ మాత్రం వేర్వేరుగా ఉన్నాయని ఉండవల్లి విశ్లేషించారు. గురువారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజధానితోపాటు రైతుల ఉద్యమంపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
కమ్మ వర్సెస్ రెడ్డి
‘‘రాజధాని తరలింపు అనేది కమ్మ, రెడ్డి కులాల గొడవలాగానే కనిపిస్తోంది. కమ్మవాళ్లు కాబట్టే బాధపెడుతున్నారని డైరెక్టుగా పేపర్లు, టీవీల్లోనే చెబుతున్నారు. రాజధానిపై ఇంత గందరగోళం ఏర్పడకముందే.. బహుశా ఆరేళ్ల కిందటే.. అమరావతి వద్దని చెప్పిన మొదటి వ్యక్తిని నేనే కావచ్చు. 30 వేల ఎకరాల్లో ప్లాన్ ఎప్పటికి వర్కౌట్ అవుతుంది? విజయవాడ లేదా గుంటూరు శివారులో పెడితే కొంతకాలానికి అనుకున్నది సాధించొచ్చు. అలా కాకుండా ఓక పెద్ద సిటీనే కడతానని చంద్రబాబు చెప్పారు. విభజన తర్వాత అసలే దిక్కులేని పరిస్థితిలో అలాంటి సిటీలను మనం భరించగలమా? పోలవరానికి జాతీయ హోదా సంగతేంటో, నిర్వాసితులకు పరిహారం సమస్యలకు ఇప్పటిదాకా పరిష్కరారాలే రాలేదు. అలాంటి పరిస్థితిలో 30వేల కోట్లతో రాజధాని నిర్మాణం ప్రయారిటీ ఎలా అవుతుంది? అసలు పదేళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి మనం ఎందుకు వచ్చేశాం? అనే ప్రశ్నలు కనీసం జగన్ కూడా అడగలేదు.
బాబు బాటలో జగన్..
రాబోయే 10 ఏళ్లలో విశాఖను హైదరాబాద్ కు పోటీగా ముందుకు తీసుకెళతానని సీఎం జగన్ అంటున్నారు. ఇక ఏపీ యువత ఎవరూ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కు పోవాల్సిన అవసరం లేకుండా చేస్తానంటున్నారు. అంటే హైదరాబాద్ లాగా అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకృతం అయ్యే నగరాన్ని నిర్మిస్తానని ఆయన చెబుతున్నారు. అసలు ఏ కారణం వల్లైతే ఏపీ, తెలంగాణ విడిపోయాయో జగన్ మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. చంద్రబాబు కూడా పెద్ద నగరాన్ని కడతానని చెప్పుకున్నారు. వీళ్లిద్దరి దృష్టిలో రాజధాని అంటే ఒక పెద్ద నగరం. విచిత్రమేంటంటే.. ఒకే చోట అభిృద్ధిని వ్యతిరేకిస్తూ టీడీపీ, వైసీపీలు తీర్మానాలు కూడా చేశాయి. అసలు పెద్ద రాజధాని లేకుండా రాష్ట్రాలు డెవెలప్ కాలేవా? ఇదిగో..
పంజాబ్ మోడల్ ఏం చెబుతోంది?
జనాభాలో 60 శాతం మంది డబ్బున్నవాళ్లే ఉన్న రాష్ట్రం పంజాబ్. కానీ అక్కడ ఏ సిటీలోనూ జనాభా 10 లక్షలకు మించి ఉండదు. అన్నీ టూ టైర్ సిటీలే. ఇండస్ట్రియల్ గానూ పంజాబ్ అందరికంటే ముందుంది. పెద్ద సిటీ కట్టడం అనే తప్పు హైదరాబాద్ లో జరిగింది. మళ్లీ ఇక్కడా అదే పొరపాటు. కాకుంటే చంద్రబాబుది ఒక స్టైల్... జగన్ ది మరో స్టైల్. అసలు టెక్నాలజీ ఇంత విస్తారంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత రాజధాని ఏంటి? దాని గురించి 50 రోజులుగా నిరాహారదీక్షలు, బూతుపురాణాలు ఏంటో అర్థం కాలేదు.
త్యాగం కానేకాదు..
అమరావతి రైతులది నూటికి నూరుశాతం త్యాగం కానేకాదు. రియల్ ఎస్టేట్ ప్లాన్ కు కన్విన్స్ అయ్యారు. హైదరాబాద్ లాగా అమరావతి కూడా పెద్ద సిటీ కాబోతుందని నమ్మారు కాబట్టే, భవిష్యత్తులో డబ్బులొస్తాయన్న ఆశతో భూములు ఇచ్చారు. చంద్రబాబు చెబుతున్నట్లు రైతులు భూముల్ని త్యాగం చేస్తే ప్రతిఫలం ఆశించొద్దుకదా. రైతులందరూ గత ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నారు. కొత్త ప్రభుత్వం.. పాత అగ్రిమెంట్లను రద్దు చేస్తానంటే ఏ ఒక్కరూ ఎలాంటి కాంట్రాక్టుకు ముందుకురారు. పోలవరంలోనూ అదే జరిగింది. రివర్స్ టెండరింగ్స్ తో 700 కోట్లు మిగిలాయని వైసీపీ చెబుతోంది. కానీ సదరు సంస్థ కోర్టుకు వెళ్లడంతో పనులు దాదాపు ఆగిపోయాయి. రైతులకు నిజంగా నష్టం లేకున్నా... తానే నష్టం చేస్తున్నానన్న ఫీలింగ్ ను జగనే కల్పించాడు. ఆఫీసులు, సంస్థల్ని వేరే చోటికి మారుస్తామంటే సీఎంను అడ్డుకునేదెవరు?
లీగల్ అవగాహన లేకే..
ఒక నిర్ణయం తీసుకునేముందు రాజకీయంగానేకాదు.. లీగల్ గానూ ఆలోచన చేయాలి. రాజధాని తరలింపుపై స్టేటస్ కో ఇస్తామని హైకోర్టు హెచ్చరించినట్లు వార్తలొచ్చాయి. ఆఫీసుల్ని అమరావతిలోనే ఉంచాలని హైకోర్టు జడ్జి చెప్పిన సందర్భంలోనే... ఢిల్లీలో బీజేపీ నేతలు విరుద్ధ ప్రకటనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టమున్న చోట రాజధాని పెట్టుకోవచ్చని, దానికి కేంద్రం అడ్డుచెప్పబోదని అంటున్నారు. అలాగే ఏపీకి రాజధాని అమరావతే అన్న హోం శాఖ లేఖతో మళ్లీ మెలిక పెట్టారు'' అని ఉండవల్లి వివరించారు.