జగన్.. తిరుగుబాటు పొంచి ఉంది: ఎమ్మెల్యేలతో జాగ్రత్త: ఉండవల్లి సంచలనం..!
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్యమంత్రి జగన్ కు హెచ్చరికలు చేసారు. అదమరిస్తే అంతే అని సూచించారు. 151 సీట్లు వచ్చాయని..దానిని శాశ్వతంగా భావించవద్దని స్పష్టం చేసారు. అదే సమయంలో నవరత్నాల్లో ఏ మాత్రం తేడా వచ్చిన సొంత వారే తిరగబడతారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో అసమ్మతి ఉంటే ఢిల్లీలో పరిష్కరించేవారని..కానీ వైసీపీలో అన్నీ జగన్ మాత్రమే నని చెప్పుకొచ్చారు. ఏపీ చరిత్రలో ఎప్పుడు అత్యధిక మెజార్టీతో ఎవరు అధికారంలోకి వచ్చినా తిరుగుబాట్లు తప్పలేదని ఉండవల్లి గుర్తు చేసారు.
ప్రజలతో పాటుగా సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో సైతం ముఖ్యమంత్రి మీద ద మంచి అభిప్రాయం ఉండేలా..వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన కలిగించేలా చూసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ మీద చంద్రబాబు తిరుగుబాటు చేస్తారని ఎవరైనా ఊహించారని అని ఉండవల్లి ప్రశ్నించారు. ఇక..విద్యుత్ ఛార్జీలు..ఇసుక కొరత పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
అధిక మెజార్టీతో గెలిచిన ప్రతీసారి ఇలా..
మాజీ ఎంపి ఉండవల్లి జగన్ ప్రభుత్వం మీద ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఏపీలో ఎప్పుుడు అత్యధిక మెజార్టీతో ఎవరు అధికారంలోకి వచ్చినా తిరుగుబాటు తప్పలేదని గుర్తు చేసారు. వైసీపీ పార్టీ అధినేతగా .. ముఖ్యమంత్రిగా.. పార్టీని.. ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తిగా జగన్ ఒక్కరే ఉన్నారని...జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ చరిత్రలో రెండే సార్లు ఇదే తరహాలో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని గుర్తు చేసారు.
1972 లో కాంగ్రెస్ పార్టీ 51 శాతం సీట్లు సాధించి పీవీ నర్సింహారావు ముఖ్యమంత్రి అయ్యారని..ఆయన భూ సంస్కరణలకు తెర తీయగానే ఆయన పైన తిరుగుబాటు మొదలైందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. అదే విధంగా 1994లో టీడీపీ అధినేత ఎన్టీఆర్ నాడు 294 సీట్లతో 213 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చారని..ఆ సమయంలో కాంగ్రెస్ కు 26 సీట్లు మాత్రమే వచ్చాయన్నారు. సరిగ్గా 9 నెలలకే ఊహించని విధంగా చంద్రబాబు తిరుగుబాటుతో ఎన్టీఆర్ పదవీచ్యుతుడయ్యారని వివరించారు.
జగన్ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం..
జగన్ తానొక్కడిగానే పార్టీని అధికారంలోకీ తీసుకొచ్చారని ఉండవల్లి ప్రశంసించారు. అయితే ఇది శాశ్వతం కాదన్నారు. అవినీతి నిర్మూలిస్తానని జగన్ చెప్పటం సంతోషమేనంటూ..ఇప్పటి వరకు జగన్ మీద పెద్దగా ఆరోపణలు చేయాల్సిన స్థాయిలో పాలన లేదన్నారు. అదే విధంగా ప్రజల్లోనే మంచి పేరు కోసం తపిస్తున్న జగన్ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
వారికి తమ ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారు..తమ మాటకు విలువ ఇస్తున్నారనే అభిప్రాయం కలిగించలేక పోతే భారీ నష్టం తప్పదని హెచ్చరించారు. గతం నుండి పాఠాలు నేర్చుకున్నవాడే నాయకుడు అవుతాడని ..చరిత్రలో జరిగిన రాజకీయ అపశ్రుతుల తెలుసుకోవాలని సూచించారు. పాలనలో చిన్న తేడా వచ్చినా కుప్పకూలిపోతారని హెచ్చరించారు. సొంత పార్టీ నేతలను జాగ్రత్తగా చూసేకోవం వారిలో వ్యతిరేకత కు అవకాశం లేకుండా నడుచుకోవటం చాలా అవసరమని వ్యాఖ్యానించారు. జగన్ చెబుతున్న నవరత్నాల్లో చిన్న తేడా వచ్చినా సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా పని చేస్తారని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
Recommended Video
విద్యుత్ కోతలు..ఇసుక కొరత వ్యతిరేకత తెస్తోంది..
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి ఇంకా ఆరు నెలలు కూడా పూర్తి కాలేదని..అయినా పాలన మీద వ్యతిరేక కామెంట్లు చేసే స్థాయిలో లేదని ఉండవల్లి చెప్పుకొచ్చారు. అదే సమయంలో రాష్ట్రంలో చంద్రబాబు హాయంలో విద్యుత్ కోతలు లేవని..ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అమలవుతున్న విద్యుత్ కోతల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పారు. దీనికి గత పాలకుల వైఫల్యాలు కారణమని చెప్పినా ప్రజలు అంగీకరించన్నారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అదే విధంగా ఇసుక కొరత కారణంగా అనేక మంది కూలీలు ఉపాధి కోల్పోయారని..దీని మీద వ్యతిరేక కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. దీనిని సైతం వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
గతంలో వైయస్ సైతం భూ సంస్కరణల దిశగా తన భూములు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తే..ఆయన పైన ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయని..ఆయన మీదే కేసులు పెట్టాలని డిమాండ్ చేసాయన్నారు. ఇటువంటివన్నీ జగన్ గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్తే భవిష్యత్ ఉంటుందని ఉండవల్లి హితబోధ చేసారు.