కేవీపీని వెనకేసుకొచ్చిన ఉండవల్లి .. పోలవరంపై అనుమానాలు నివృత్తి చేస్తే బహిరంగ క్షమాపణ చెప్తా
సీనియర్ నాయకుడు , మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోలవరం ప్రాజెక్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యలను సమర్ధించారు. కేవీపీ ప్రశ్నించిన దానిలో తప్పేమీ లేదని, పోలవరంపై ప్రజలకు అనుమానాలున్నాయని ఆయన ఆన్నారు. అయినా టీడీపీ , కాంగ్రెస్ రెండూ ఒకే కదా.. కేవీపీ కాంగ్రెస్ నేతనే కదా అంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు.
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అధికార పార్టీ తీరును ఆక్షేపించిన ఉండవల్లి అరుణ్ కుమార్
విజయవాడలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన జూన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్ట్ పూర్తై పోతుందని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వచ్చే ఏడాది అని మాట మార్చిందని ఉండవల్లి తప్పు పట్టారు . ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ పై వాడి వేడి చర్చ సాగుతున్న వేళ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అధికార పార్టీ తీరునుఆక్షేపించారు . పోలవరం నిర్మాణంలో ఏ చిన్న పొరబాటు చేసినా జరిగే నష్టం ఊహకు కూడా అందనిదని ఆయన ఆన్నారు . ఇక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకుండా జరుగుతున్న జాప్యానికి గల కారణాలు ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కుడికాల్వకు సంబంధించిన పనులు పూర్తి కావొచ్చాయని.. కానీ ఎడమ కాలువకు సంబంధించిన పనులు ఇంత వరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని ఆయన ఫైర్ అయ్యారు.
పోలవరంపై అనుమానాలు నివృత్తి చేస్తే బహిరంగ క్షమాపణ చెప్తా ... ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
కేవీపీ రామచంద్రరావు వ్యక్తం చేసిన అనుమానాలు చాలా మందికి ఉన్నాయన్న ఉండవల్లి తన అనుమానాలు నివృత్తి చేస్తే బహిరంగంగా క్షమాపణలు చెబుతానని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్ట్గా ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని ఉండవల్లి మండిపడ్డారు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు, రాష్ట్రం ఒప్పుకోవటం రాష్ట్ర ప్రజలపై భారం మోపటమే అని ఆయన అభిప్రాయపడ్డారు. కేవీపీ రామచంద్రరావు కేసుకు.. చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని అది కేంద్రప్రభుత్వంపై వేసిన కేసని ఉండవల్లి తెలిపారు. రామచంద్రరావు కేసు వల్ల రాష్ట్రప్రభుత్వానికే మేలు జరుగుతుందని అరుణ్ కుమార్ తెలిపారు.
కాంగ్రెస్ , టీడీపీ రెండూ ఒకటే కదా .. కాంగ్రెస్ నేత కేవీపీపై దేవినేని వ్యాఖ్యలు సరి కావు..
ఇక కేవీపీపై దేవినేని ఉమా వ్యాఖ్యలు సరికావన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ . కాంగ్రెస్, టీడీపీ రెండూ ప్రస్తుతం ఒక్కటైన నేపథ్యంలో ఉమా వ్యాఖ్యలు అర్ధ రహితం అన్నారు. అసలు కేవీపీపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించారు ఉండవల్లి . 2020కి కూడా పోలవరం పూర్తవుతుందన్న గ్యారెంటీ ఏ మాత్రం లేదని ఉండవల్లి సందేహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా పోలవరం విషయంలో చంద్రబాబుకు అడుగడుగునా చుక్కెదురవుతుంది. తాజాగా ఉండవల్లి వ్యాఖ్యలు కూడా అదే చెప్తోంది.