చంద్రబాబు విచారించాలి: నిప్పులు చెరిగిన ఉండవల్లి
రాజమహేంద్రవరం: కృష్ణా పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబ నాయుడిపై మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాట ఘటనపై గోదావరి పుష్కరాల్లో అంతా తానై వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని విచారించాలని ఆయయన వాదించారు.
తొక్కిసలాట దుర్ఘటనపై ఏర్పాటైన జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిషన్ విచారణ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా ఆర్అండ్బి అతిథిగృహంలో జరిగింది. గోదావరి పుష్కరాల్లో సిఇఒగా వ్యవహరించి, ట్రాఫిక్ను కూడా క్రమబద్ధీకరించిన సిఎంను ప్రత్యక్ష సాక్షిగా పరిగణించి విచారించాలని విచారణకు హాజరైన ఉండవల్లి అన్నారు.
సిఇఒగా వ్యవహరించి పూర్తి బాధ్యతను వహించిన ముఖ్యమంత్రి తన బాధ్యతల నుంచి తప్పించుకునేందుకే విచారణ కమిషన్ను వేశారని ఆరోపించారు. తొక్కిసలాట ఘటనపై ఇప్పటి వరకు ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకోలేదని అన్నారు. 2005లో కృష్ణా పుష్కరాల సందర్భంగా రెయిలింగ్ కూలిపోయి ఎనిమిది మంది మరణిస్తే అప్పటి ప్రభుత్వం విచారణకు ఆదేశించి, కలెక్టర్, ఎస్పీలను బదిలీ చేసి, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను సస్పెండ్ చేసిందని ఆయన గుర్తుచేశారు.
కలెక్టర్ తన అఫిడవిట్లో తమను ప్రతిక్ష నాయకులుగా పేర్కొనడంపై తీవ్ర ఆక్షేపణ తెలిపారు. దీన్ని బట్టి తనను తాను అధికారపక్షానికి చెందిన వ్యక్తిగా కలెక్టర్ పేర్కొన్నట్లు ఉందని అభిప్రాయపడ్డారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికల్లో ఏది సరైందో కూడా తేల్చాలని ఉండవల్లి వాదించారు. ఈ సంఘటనపై కలెక్టర్ను, సంబంధిత అధికారులను కూడా విచారించాలన్నారు. విచారణలో భాగంగా ఈ నిర్లక్ష్యానికి బాధ్యులను తేల్చి, వారిని విచారించాలని, లేనిపక్షంలో కమిషన్ ఏర్పాటుకు అర్థం ఉండదని అన్నారు.
లెక్టర్ అఫిడవిట్లో సరైన ఆధారాలు ఇవ్వలేదని, ఆయన వాదనల్లో హేతుబద్ధత కూడా లేదని బార్కౌన్సిల్ సభ్యుడు, న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు వాదించారు. పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన కెమెరాలు కేవలం పరిశీలనకే వినియోగించామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. సిసి కెమెరాలకు సంబంధించిన ఫుటేజీ కూడా లేదని చెప్పారన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాలరేవులో ఎక్కువసేపు గడపటం వల్లే తొక్కిసలాట జరిగిందని వాదించారు. ప్రభుత్వం తరుపున అఫిడవిట్ దాఖలు చేసిన కలెక్టర్ను విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.
పుష్కరాల్లో విఐపిల కోసం ప్రత్యేక స్నానఘట్టం ఏర్పాటు చేయగా, ముఖ్యమంత్రి పుష్కరాలరేవులో ఎక్కువ సమయం ఉండటం వల్లే తొక్కిసలాట జరిగిందని వైసిపి కేంద్రకమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సోమయాజులు ఈనెల 14కు విచారణను వాయిదా వేశారు.