చంద్రబాబును పేర్కొనలేదు, ఎందుకు: ఓటుకు నోటు కేసులో ఉండవల్లి ఇంప్లీడ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సంబంధం ఉందని భావిస్తున్న ఓటుకునోటు కేసు కొత్త మలుపు తిరిగింది. తనపై ఏసిబి కోర్టు తాజా దర్యాప్తునకు ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్ కేసులో తన వాదనలు వినిపించేందుకు అనుమతించాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్ హైకోర్టును కోరారు.
ఈ మేరకు ఉండవల్లి పిటిషన్ దాఖలు చేశారు. ఏసిబి విభాగం ఓటుకు నోటు కేసులో చార్జిషీటును దాఖలు చేసిందని, ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరుందని తెలిపారు. 20 సార్లు చంద్రబాబు పేరును ఏసిబి ప్రస్తావించిందని చెప్పారు.
ఈ కేసులో చంద్రబాబును సాక్షిగా లేదా నిందితుడిగా ఏసిబి పేర్కొనలేదని అన్నారు. ఈ కేసులో అనుమానితులపై తాజా దర్యాప్తు జరపాలని ఏసిబి కోర్టు ఆదేశించడంలో ఎటువంటి తప్పు లేదన్నారు. ఈ కేసులో తన వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని ఉండవల్లి కోర్టును కోరారు.
ఈ కేసులో చంద్రబాబు పాత్రపై విచారించాలనే ఎసిపి కోర్టు ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. కేసులో చంద్రబాబును విచారించాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంప్లీడ్ అవుతుండడంతో కేసు కొత్త మలుపు తీసుకునే అవకాశం ఉంది.