మార్గదర్శిపై ఆరోపణలు, రామోజీకి పద్మవిభూషణ్ ఇస్తారా?: ఉండవల్లి
హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడంపై రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం చెప్పారు. ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు మార్గదర్శి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న రామోజీరావుకు పద్మ విభూషణ్ ఇవ్వడమేమిటని ఆయన అన్నారు.
మార్గదర్శి ఫైనాన్స్కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని రామోజీరావుపై ఆరోపణలు ఉన్నాయని, వాటినుంచి రామోజీ బయటపడలేదని ఆయన మీడియా సమావేశంలో అన్నారు. 1996లోనే ప్రాచీన విగ్రహాలను విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఆరోపణలున్నాయని, ఈ కేసు కూడా ఇంకా నడుస్తోందని ఆయన అన్నారు.
జర్నలిజం, సాహిత్యం, విద్యారంగాల్లో చేసిన కృషికి గాను చంద్రబాబు ప్రభుత్వం రామోజీ రావు పేరును అవార్డుకు సిఫార్సు చేసిందని ఆయన చెప్పారు. ఫ్యాన్సీగా చీఫ్ ఎడిటర్ అని పేరు పెట్టుకుంటారు గానీ రామోజీరావుకు వంద పదాలతో వ్యాసం రాయడం కూడా రాదని ఆయన అన్నారు.
సాహిత్యంలో కూడా రామోజీ ఒక్క పుస్తకం కూడా రాయలేదని ఆయన గుర్తు చేశారు. విద్యకు సంబంధించి భార్య రమాదేవి పేరుతో ఒక్క ప్రైవేట్ పాఠశాలను మాత్రమే రామోజీ నడుపుతున్నారని, రామోజీ రావు వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త మాత్రమేనని ఉండవల్లి అన్నారు.
కేసుల్లో ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తికి పద్మ విభూషణ్ వంటి ఉన్నతస్థాయి పురస్కారం ఇచ్చేటప్పుడు ప్రభుత్వాలు ఆలోచించి ఉండాల్సిందని ఆయన అన్నారు .రామోజీకి అవార్డు ఇవ్వాలని సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని మీడియా ద్వారా తాను అడుగుతున్నట్లు తెలిపారు.