కాంగ్రెస్కు ఉండవల్లి సహా నలుగురు ఎంపీలు రిజైన్?
న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణ నోట్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడాన్ని నిరసిస్తూ నలుగురు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పార్టీకి రాజీనామా చేశారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, రాజంపేట లోకసభ సభ్యుడు సాయి ప్రతాప్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ తీరుపై ఆ నలుగురు కూడా తీవ్రంగా ధ్వజమెత్తారు.
రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకున్న నిర్ణయం మింగుడుపడకనే తాను పార్టీలో ఉండలేకపోతున్నానని ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేబినెట్ దశలోనే ఆగిపోతుందని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు రాదని ఆయన అన్నారు. శాసనసభ అభిప్రాయానికి విరుద్ధంగా ఏ రాష్ట్రం కూడా ఏర్పడలేదని ఆయన అన్నారు.
సాయిప్రతాప్ తన రాజీనామా లేఖను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పంపించారు. తనతో సహా కాంగ్రెసు పార్టీలో ఎవరూ ఉండరని పార్టీకి రాజీనామా చేసిన అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు.
కాంగ్రెసు అదిష్టానం కుట్రపూరితంగా వ్యవహరించిందని సబ్బం హరి విమర్శించారు. కాంగ్రెసు అధిష్టానం ఓసారి చంద్రబాబు మీద, మరోసారి కెసిఆర్ మీద, ఆ తర్వాత జగన్ మీద కుట్ర చేసిందని ఆయన అన్నారు. వీరి బాటలో మరింత మంది పార్లమెంటు సభ్యులు కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేయవచ్చునని భావిస్తున్నారు.
కాగా, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ విభజన నిర్ణయంపై కోర్టుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలావుంటే, రాష్ట్ర మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాస రావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో గురువారం రాత్రి సమావేశమయ్యారు. తెలంగాణ నోట్కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపే సమయంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలోనే ఉన్నారు.