అమరావతి బాండ్లపై వారి పేర్లు చెప్పు, స్విస్ జైల్లో చంద్రబాబు సలహాదారు: ఉండవల్లి
రాజమహేంద్రవరం: అమరావతి బాండ్ల పైన మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం నిప్పులు చెరిగారు. అధిక వడ్డీకి అప్పు తీసుకోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు. బాండ్ల ద్వారా తీసుకున్న రూ.2వేల కోట్ల అప్పుకు ప్రతి నెల 10.36 శాతం వడ్డీ చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి బాండ్లలో బ్రోకర్కు రూ.17 కోట్లు ఇవ్వడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతున్న పారదర్శకతనా అని నిలదీశారు. అమరావతి బాండ్లు కొన్న తొమ్మిది మంది పేర్లను వెల్లడించాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లలో చేసిన రూ.1.30 లక్షల కోట్ల అప్పుకు ప్రభుత్వం లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.
స్విట్జర్లాండు జైల్లో చంద్రబాబు సలహాదారు
విజన్ 2020 రూపొందించిన ఒకప్పటి చంద్రబాబు నాయుడు సలహాదారు పాస్కల్, ప్రస్తుతం స్విట్జర్లాండ్ జైలులో ఉన్నాడని ఉండవల్లి మండిపడ్డారు. పెట్రోలు, మద్యం పైన ఎక్కడ, ఏ రాష్ట్రాల్లో లేని పన్నులు మన రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోందని ధ్వజమెత్తారు. రూ.50 క్వార్టర్ బాటిల్లో రూ.37 ప్రభుత్వమే దండుకుంటోందని ఆరోపించారు.
ప్రభుత్వం ఆ అప్పును ఏం చేసింది?
అధిక వడ్డీకి అప్పులు తీసుకోవద్దని ఏడు నెలల క్రితమే జీవో జారీ చేశారని ఉండవల్లి గుర్తు చేశారు. నాలుగేళ్లలో తీసుకున్న రూ.1.30లక్షల కోట్ల అప్పును ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. మందుబాబులు ఓ వారం రోజుల పాటు ధర్నా చేస్తే ప్రభుత్వాలు అల్లాడిపోతాయని ఉండవల్లి ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం అన్యాయంపై తనను చాలామంది సంప్రదిస్తున్నారు
ఏపీలో జరుగుతున్న అన్యాయంపై చాలామంది తనను సంప్రదిస్తున్నారని, ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వస్తామని చెబుతున్నారని ఉండవల్లి అన్నారు. అమరావతి బాండ్లు, వడ్డీరేట్లపై చర్చ జరుగుతోందని, ట్యాక్స్ ఎంతో తెలియకుండా బాండ్లు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. కండిషన్ల మధ్య రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసే పరిస్థితి నెలకొందన్నారు. పేద, ధనికుల మధ్య అంతరాన్ని తొలగించాలని, పేదల ఆర్థిక స్థితులను మార్చాలన్నారు.
నిజం చెప్పి పాలించగలరా?
దేశంలో ఎక్కడలేని విధంగా వడ్డీలు ప్రభుత్వం వసూలు చేస్తోందని ఉండవల్లి ధ్వజమెత్తారు. జలయజ్ఞంలో ఇచ్చిన కేటాయింపులు ఏమిటన్నారు. చంద్రబాబు నిజం చెప్పి పాలన చేయగలరా అన్నారు. చంద్రబాబు చేస్తున్న వ్యాపారాన్ని స్విట్జర్లాండ్ ఆర్థికవేత్త వ్యతిరేకించారని, ఆయన లెక్కలు చెబితే జైళ్లో పెడతారని చెప్పినట్లు పేర్కొన్నారు. వారానికోసారి ఖర్చు పెట్టిన లెక్కలు ప్రజలకు చెప్పగలరా అని ప్రశ్నించారు. కనీసం ఈ తొమ్మిది నెలలకైనా ఖర్చు చెప్పగలరా అన్నారు. అవినీతి చేసి డబ్బులివ్వాల్సి వస్తోందని బాబు చెప్పారని, నంద్యాల ఎన్నికల్లో ఒప్పుకున్నారన్నారు.