హైదరాబాద్లో హెరిటేజ్, ఐటి కంపెనీలు ఎలా వస్తాయి: ఉండవల్లి
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫ్రెష్ ప్రధాన కార్యాలయం హైదరాబాదులో ఉందని, తెలంగాణకు పన్ను చెల్లిస్తోందని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
చంద్రబాబు మాత్రమే తన కార్యాలయాన్ని విజయవాడకు మార్చుకన్నారని, హైదరాబాదును వదిలిపెట్టి ఎవరూ రావడం లేదని ఆయన అన్నారు. సినిమావాళ్లు కూడా అక్కడే ఉన్నారని గుర్తు చేశారు.
కార్పోరేట్ కంపెనీలన్నీ బెంగళూరు, హైదరాబాదులోనే ఉన్నాయని ఉండవల్లి చెబుతూ హైదరాబాదు నుంచి ఐటి కంపెనీలు కోస్తాకు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలకు, లెక్కలకు పొంతన లేదని ఆయన విమర్శించారు.
రాష్ట్రాభివృద్ధిపై చంద్రబాబు కాకిలెక్కలు చెబుతున్నారని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో అన్నారు. జీడిపి పెంచామని చెబుతూనే రాష్ట్రం అప్పుల్లో ఉందని అంటున్నారని ఆయన అన్నారు.
Recommended Video
రాష్ట్రానికి న్యాయం చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కేంద్రంపై కానప్పుడు ఎవరిపై కోర్టుకు వెళ్తారని ఆయన అడిగారు. ముఖ్యమంత్రి పక్కన కూర్చుని మరీ ఎపీకి ప్రత్యేక హోదా ఎందుకని నీతీ ఆయోగ్ చైర్మన్ అనడం దారుణమని అన్నారు.