సీఎం జగన్ నివాసం వద్ద నిరుద్యోగుల ఆందోళన..
కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వానికి అప్పుడే సమస్యల వలయాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు కల్పించాలంటూ తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ నివాసం ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శలు చేశారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ముగిసినా..తమకు ఉద్యోగాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న 2008 డిఎస్సీ అభ్యర్థులు తమకు ఎస్జీటీలుగా అవకాశం కల్పించాలని కోరుతూ తాడేపల్లి గూడేంలోని ముఖ్యమంత్రి జగన్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే వారు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు గ్రామ సచివాలయాల్లో తమను నియమించాలని కోరుతూ గోపాల మిత్ర సీఎం ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు.
ఈనేపథ్యంలోనే తమకు ఉద్యోగ భద్రత కల్పించి, వేతనాలు పెంచాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య మిత్ర సీఎంను కలిసేందుకు వచ్చారు. అయితే సీఎం ఇంటి వద్ద ఉన్నతాధికారులు వారి విజ్ఝప్తులను తీసుకుని సమస్యను పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. అయితే ఆరోగ్యమిత్రలు మాత్రం సీఎం కలిసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అందోళన కొనసాగించారు.