ఎపిలో రెండు నెలల్లో అనూహ్య పరిణామాలు:బిజెపి నేత వెల్లడి
అవునా...ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు నెలల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా?...అంటే అవుననే అంటున్నారు బిజెపి నేతలు. అయితే అవి ఏ విధమైన పరిణామాలో వెల్లడించనప్పటికీ అనూహ్యమైనవని మాత్రం తేటతెల్లం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇంత ముఖ్యమైన విషయాన్ని గురించి చెప్పిన ఆ బిజెపి నేత ఎవరు?...ఏ సందర్భంలో...ఎక్కడ ఈ విషయం చెప్పారో తెలుసుకోవాలనుందా?...అయితే చదివేసేయండి!
కర్ణాటకలో ఎన్నికల సంగ్రామానికి సమాయత్త చర్యల్లో తలమునకలుగా ఉన్న బీజేపీ కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర్రావు బెంగుళూరు లో ఒక తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే ఎపీ ప్రత్యేక హోదా సెంటిమెంట్ ప్రభావం కర్ణాటక ఎన్నికల్లో ఏమాత్రం ఉండబోదని మురళీధర్రావు చెప్పారు.
కర్ణాటక శాసనసభ ఎన్నికల ముగిసిన అనంతరం తమ పూర్తి స్థాయి దృష్టి ఆంధ్రప్రదేశ్ పై కేంద్రీకరిస్తామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎపిలో తమ పార్టీని బలోపేతం చేసేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోబోమని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఏపీలో రాబోయే రెండు నెలల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ఆయన ఈ వ్యాఖ్యలు హెచ్చరికగా చెప్పారా?..లేక జోస్యం లాగా చెప్పారా?...అనే విషయమై మరో రెండు నెలలు ఆగితే కాని స్పష్టంగా తెలిసే అవకాశం లేదని చెప్పొచ్చు. ఏదేమైనా ఈ బిజెపి కీలక నేత వ్యాఖ్యలను బట్టి కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ పై బిజెపి దృష్టి సారిస్తుందనడంలో భావం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకుంటే కర్ణాటకలో గణనీయంగా ఉన్న తెలుగువారిపై వాటి తాలూకూ ప్రభావం పడి అవి ఎన్నికలలో ఓట్లను ప్రభావితం చేయొచ్చని బిజెపి నేతలు భావిస్తున్నట్లుగా అర్ధం చేసుకోవచ్చని వారు విశ్లేషిస్తున్నారు. మరోరకంగా చూస్తే ఒక రాష్ట్రం తరువాత మరో రాష్ట్రం వ్యవహారాలపై దృష్టి పెట్టినట్లయితే పూర్తి స్థాయి ఏకాగ్రతతో తాము అమలు చేయాలనుకున్న వ్యూహాలను అమలు చేయవచ్చని బిజెపి అధిష్టానం భావిస్తూ ఉండవచ్చని అంటున్నారు. ఏదేమైనా ఈ బిజెపి నేత వ్యాఖ్యలు ఎపి రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.