రాజధాని జిల్లాలో బిజెపికి ఊహించని షాక్...పార్టీని వీడిన ఇద్దరు కీలక నేతలు
గుంటూరు:రాజధాని జిల్లా గుంటూరులో భారతీయ జనతాపార్టీకి అనూహ్యంగా పెద్ద ఎదురుదెబ్బే తగిలింది.రెండు సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరు కీలక నాయకులు గురువారం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడం ఆ పార్టీకి షాక్ ఇచ్చింది.
బిజెపి రాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్న కక్షపూరితమైన తీరుకు విసిగి పార్టీని వీడుతున్నట్లు ఒక నేత ప్రకటించగా...ఎంపి జివిఎల్ వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు మరో నేత వెల్లడించారు. ఆ నేతల్లో ఒకరు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మామిడి హరికృష్ణ కాగా మరొకరు భాజపా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బీఎస్సార్ యాదవ్.
తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మామిడి హరికృష్ణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం,ప్రధాని మోడీపై విమర్శల వర్షం కురిపించారు. సిఎం చంద్రబాబునాయుడుపై ప్రధాని మోడీ కక్ష పెంచుకొని ఆంధ్రప్రదేశ్ పై పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారని మామిడి హరికృష్ణ ఆరోపించారు.
ప్రధాని మోడీ ఎపికి న్యాయం చేస్తారనే నమ్మకంతో తాను బిజెపిలో చేరానని, కానీ రాష్ట్రానికి కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా కేటాయించకపోగా అన్ని అభివృద్ధి పనులకు అడ్డం పడుతున్నారన్నారు. అందువల్లే తాను పార్టీకి రాజీనామా చేశానని ప్రకటించారు. అయితే మామిడి హరికృష్ణ పార్టీని వీడటంపై బిజెపి నేతల వాదన మరోలా ఉంది. కీలక సామాజిక వర్గానికి చెందిన తాను పార్టీలో నాలుగున్నర ఏళ్ళుగా కొనసాగుతున్నా కీలక పదవి ఇవ్వకపోవడంపై కినుక వహించి ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు వాళ్లు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.
పైగా ఇటీవల యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గంలో పదవుల భర్తీ విషయంలో తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని...అలాగే పార్టీ కార్యక్రమాల గురించి ఎలాంటి సమాచారం తనకు ఇవ్వడం లేదంటూ హరికృష్ణ ఆయన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసిందని బిజెపి నేతలు చెబుతున్నారు. ఇలా తీవ్ర అసంతృప్తితో ఉన్న మామిడి హరికృష్ణను టిడిపి నేతలు కలిసి వారి పార్టీలోకి ఆహ్వానించగా ఆయన బిజెపిని వీడారని చెబుతున్నారు.
గురువారం పార్టీకి గుడ్ బై చెప్పిన బీజేపీ ఓబీసీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు బీఎస్సార్యాదవ్ మాట్లాడుతూ ఎంపి జీవీఎల్ నరసింహారావు బీసీలను అవమాన పర్చేవిధంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీరు నచ్చకే తాను పార్టీని వీడుతున్నానని చెప్పారు. ఈ విషయమై గురువారం ఆయన బాపట్లలో విలేకరులతో మాట్లాడారు. ఏపీలో బిజెపిలో బీసీలకు ఏవిధమైన ప్రాధాన్యం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. బీసీల ఓట్లతో గెలుపొంది నేడు బీసీలనే అగౌరవ పర్చేలాగా వ్యవహరించటం సరికాదని మండిపడ్డారు.అందుకే తాను బిజెపి సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.