లెక్కలేశా...మాడులు పగలాలి:మంత్రి అఖిల ప్రియ నోటి వెంట అనూహ్యమైన హెచ్చరికలు...ఎవరికి?
కర్నూలు:అనుకున్నంతా అయింది...మరోసారి మంత్రి అఖిల ప్రియ తన అసమ్మతి గళాన్ని వినిపించడం మొదలుపెట్టేశారు. తాజాగా అధికార పార్టీ నేతలకు, అధికారులకు వార్నింగ్ లు ఇస్తూ మంత్రి అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
మంత్రిగా ఉన్నప్పటికీ గత కొంత కాలంగా ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో స్థబ్దుగా ఉండిపోతున్న అఖిల ప్రియ వ్యవహారం ఎపి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మంత్రి అఖిల ప్రియ పార్టీ మారడం ఖాయమంటూ ప్రచారం కూడా ఊపందుకోవడమే కాదు ఆమె జనసేనలో చేరనున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తాజాగా మంత్రి అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ ప్రచారం నిజమేనేమో అనిపించేలా ఉన్నాయి.
దత్తత గ్రామంలో...పాత జ్ఞాపకాలు
కర్నూలు జిల్లా నంద్యాల మండలంలోని తన దత్తత గ్రామం కొత్తపల్లికి వెళ్లిన పర్యాటక శాఖా మంత్రి అఖిలప్రియ గతాన్ని గుర్తుచేసుకున్నారు. తన తండ్రి భూమా నాగిరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఆయనను అధికారంపార్టీకి చెందిన వారు అవమానించారని...దాని వెనుక ఎవరున్నారో తనకు తెలుసని అన్నారు. వారి లెక్క తేల్చేవరకు విశ్రమించేది లేదని నవ్వుతూనే ఘాటైన హెచ్చరికలు ఇచ్చారు.
లెక్కలేశా...మాడులు పగలాలి
గతంలో భూమానాగిరెడ్డి నంద్యాలకు వచ్చినప్పుడు అధికారులు ఆయనపై ఏ విధంగా కేసులు పెట్టింది...ఇబ్బందుల పాలు చేసింది ఆమె జ్ఞాపకం చేసుకున్నారు. అవన్నీ లెక్కలు వేసుకున్నానని చెప్పారు. కొత్తపల్లిలో తమ జెండా ఎగురవేయాలని, ఆ జెండా చూసి ప్రత్యర్థుల మాడులు పగిలిపోవాలని అఖిలప్రియ ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు పిలుపు ఇచ్చారు.
ఎవరికి...ఈ హెచ్చరికలు
తాను కొత్తపల్లికి ప్రతి రోజు వస్తానని ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఎవరైనా ప్రజలను ఇబ్బంది పెట్టాలని, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే వాళ్ల తాటతీస్తానని మంత్రి అఖిల ప్రియ ఘాటుగా హెచ్చరించారు. అయితే మంత్రి అఖిల ప్రియ ఉన్నట్లుండి ఇంత ఘాటుగా హెచ్చరికలు చేయడం...అది కూడా పార్టీల పేర్లు ఎత్తకుండా వ్యాఖ్యలు చేయడం...ఆ వ్యాఖ్యలు కూడా పరోక్షంగా అధికారపార్టీ నేతలను, అధికారులను ఉద్దేశించి ఉండటం చర్చనీయాంశంగా మారాయి.
ఆ పార్టీలోకేనా...ప్రచారం
దీంతో ఆమె త్వరలోనే పార్టీ మారడం ఖాయమనే విశ్లేషణలు కూడా ప్రారంభం అయ్యాయి. కారణాలు ఏమైనప్పటికీ టిడిపిలో తనకి సరైన భవిష్యత్తు ఉండకపోవచ్చని మంత్రి అఖిల ప్రియ విశ్లేషించుకుంటున్నారట. దీంతో అలాంటి పరిస్థితి వస్తే రాజకీయంగా దెబ్బతినకుండా ముందు జాగ్రత్తగా ఇప్పటినుంచే సరైన వ్యూహంతో ముందడుగు వేయాలని ఆమె భావిస్తున్నారట. ఒకవేళ పార్టీ మారడం అనివార్యమైన పక్షంలో ఆమె వివిధ కారణాల రీత్యా వైసిపిలోకి మళ్లీ వెళ్లే అవకాశం లేదని...తాజా సమీకరణాలను బట్టి ఆమె జనసేనలో చేరొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సస్పెన్స్ వీడేందుకు కొంత సమయం పట్టొచ్చంటున్నారు.