హోదా పాలిటిక్స్: ప్యాకేజీ ఒప్పుకునేందుకు బాబు ఎవరు..? 24న రాష్ట్రబంద్కు జగన్ పిలుపు
Recommended Video
కాకినాడ: అవిశ్వాస తీర్మానం తర్వాత ఏపీతో పాటు ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. లోక్సభలో మోడీ మాట్లాడిన తర్వాత అర్థరాత్రి ఏపీ సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్ శనివారం ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు వైఫల్యాలను మరోసారి ఏకిపారేశారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలు వ్యవహరించిన తీరుపై జగన్ మండిపడ్డారు. అవిశ్వాసం చర్చలో ఏపీ ప్రత్యేక హోదాపై ఒక్క నిమిషం కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసినందుకు గాను నిరసన తెలుపుతూ ఈ నెల 24న రాష్ట్ర బంద్కు ప్రతిపక్షనేత పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన కేంద్రానికి గట్టి సంకేతాలు పంపాలని ఆయన సూచించారు. అసలు రాష్ట్రానికి చెందిన హక్కులను తాకట్టు పెట్టేందుకు చంద్రబాబు ఎవరని జగన్ నిప్పులు చెరిగారు.
పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిన తీరును తప్పుబట్టారు జగన్. ఏపీపై కేంద్రానికి ఉన్న ప్రేమను చూసి బాధేసిందన్నారు. ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇతర పార్టీ నేతలు ఒక్కరంటే ఒక్కరు కూడా ఏపీ ప్రత్యేక హోదాపై మాట్లాడలేదని మండిపడ్డారు. ఆరోజు కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొడితే అందుకు బీజేపీ మద్దతు తెలిపిందని... టీడీపీ కూడా ఓకే చెప్పిందని జగన్ గుర్తు చేశారు. మోడీ కనీసం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కానీ, ఇవ్వాల్సిన బాధ్యత తమదే అనే మాట కూడా మాట్లాడలేదని జగన్ ఫైర్ అయ్యారు. తిరుపతిలో ఏపీకి ప్రత్యేక హోదా 10 ఏళ్ల పాటు ఇస్తామని చెప్పిన మాట తనకు గుర్తురాలేదా అని జగన్ ప్రశ్నించారు.
చంద్రబాబు హోదా కంటే ప్యాకేజీకి నాడు ఒప్పుకున్నారని ప్రధాని చెప్పడం చూస్తే మరింత బాధ కలిగించిందని జగన్ అన్నారు. అసలు ఏపీకి ప్రత్యేక హోదా మన హక్కు అయినప్పుడు రాష్ట్రానికి ప్యాకేజీ ఒప్పుకునేందుకు చంద్రబాబు ఎవరని జగన్ నిలదీశారు.ప్రత్యేక హోదాతో ఎన్నో లాభాలు రాష్ట్రానికి చేకూరుతాయని చెప్పిన జగన్... హోదాతో పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వలసలు తగ్గుతాయి, పన్ను మినహాయింపులు ఉంటాయని వివరించారు. స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో యూటర్న్ తీసుకుని హోదా అంటున్నారని ధ్వజమెత్తారు. 2017 జనవరి 26న ప్రెస్మీట్ పెట్టి ప్యాకేజీ ఇచ్చిన కేంద్రాన్ని చంద్రబాబు పొగిడారని జగన్ గుర్తు చేశారు. ఏ రాష్ట్రానికి ఇంతకన్నా ఎక్కకువ నిధులు వచ్చాయో చెప్పాలని చంద్రబాబు సవాల్ విసిరారని జగన్ చెప్పుకొచ్చారు.
నిన్న జరిగిన చర్చలో రాజ్ నాథ్ సింగ్ చంద్రబాబు ఎప్పటికీ తమ మిత్రుడే అని చెప్పడం చూస్తే వారి మధ్య ఇంకా ఏదో ఒప్పందం ఉందనే స్పష్టమవుతోందని జగన్ చెప్పారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రసంగాన్ని ప్రారంభించిన గల్లా జయదేవ్ తాము మొదటినుంచి ప్రస్తావించిన అంశాలనే ఆయన సభలో చెప్పారని...కొత్తగా ఏమిచెప్పారని జగన్ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా టీడీపీ ఎంపీలు కళ్లు తెరిచి రాజీనామాలు చేసి నిరాహార దీక్షకు కూర్చుంటే దేశం మొత్తం తమవైపు ఎందుకు చూడదో చూద్దామన్నారు జగన్.