విశాఖలో దారుణం: మంచి నీళ్లు అడిగి నవవధువు గొంతు కోశారు
అమరావతి: మంచి నీళ్లు అడిగి ఓ గుర్తు తెలియని వ్యక్తి నవవధువు గొంతు కోసిన సంఘటన విశాఖపట్నంలోని గాజువాక శ్రీనగర్ అఫీషియల్ కాలనీలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో యువతి గొంతుపై తీవ్రగాయం కావడంతో గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాజువాక సీఐ ఇమ్మానుయేలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మోటార్ మెకానిక్గా పనిచేస్తున్న పడవల ఈశ్వరరావు శ్రీనగర్ అఫీషియల్ కాలనీ రోడ్డు నెంబర్ 1లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు.
మచిలీపట్నానికి చెందిన కావేరి (18)తో మూడు నెలల క్రితమే వివాహమైంది. ఆషాఢానికి పుట్టింటికి వెళ్లిన ఆమెను ఈశ్వరరావు ఆదివారమే తన ఇంటికి తీసుకొచ్చాడు. సోమవారం ఉదయం ఈశ్వరరావు తన మెకానిక్ షెడ్డుకు వెళ్లిపోయాడు. తల్లి నాగలక్ష్మి పాచి పనులకు పక్కవీధిలోకి వెళ్లగా కావేరి ఒక్కతే ఇంట్లోనే ఉంది.
పనులు పూర్తి అయ్యాక నాగలక్ష్మి ఇంటికి రాగా పడక గదిలో కావేరి తీవ్ర రక్తస్రావంతో మెడ పట్టుకుని ఉంది. దీనిని గమనించిన నాగలక్ష్మి... కావేరిని వెంటనే స్థానికుల సాయంతో గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. సరైన సమయంలో చికిత్స అందించడంతో కావేరికి ప్రాణాపాయం తప్పింది.
ఇక షెడ్డు నుంచి ఇంటికి వచ్చిన ఈశ్వరరావుకు చుట్టుపక్కల వారు జరిగిన విషయాన్ని చెప్పడంతో ఆసుపత్రికి వెళ్లాడు. కావేరి గొంతు వద్ద బ్లేడుతో కోసినట్టు గాయమైంది. దీనిపై సమాచారం అందుకున్న సీఐ ఇమ్మానుయేలురాజు ఆసుపత్రికి చేరుకుని కావేరిని విచారించారు.
గుర్తుతెలియని వ్యక్తి ఒకరు వచ్చి మంచినీళ్లడిగాడని, నీళ్లు తీసుకురావడానికి తాను ఇంట్లోకి వెళ్లడంతో తనతో పాటే అతడు లోపలికి వచ్చి మెడలోని గొలుసును లాక్కెళ్లబోయాడు. దీనికి కావేరి ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి పరారయ్యాడని చెప్పింది.
అయితే సంఘటన స్థలంలో క్లూస్ సిబ్బంది వివరాలు సేకరించగా.. మంచంపై దిండు కింద బ్లేడ్ కనిపించిందని, పోలీసు జాగిలం ఇంట్లోనే కలియ తిరిగిందని సీఐ తెలిపారు. దీంతో పలు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కావేరి తానే ఆత్మహత్యయత్నానికి పాల్పడిందా..? లేదా భర్త ప్రమేయంతో జరిగిందా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఆమె కోలుకున్నాక మరిన్ని వివరాలు సేకరిస్తామని, ఈశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. సంఘటనాస్థలాన్ని విశాఖ సౌత్జోన్ ఏసీపీ రామ్మోహన్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.