జైట్లీ నోట వినిపించని 'తెలుగు' రాష్ట్రాలు, ఏపీకి ఏమిచ్చారంటే: ఏ ఊసు లేదు, చంద్రబాబు షాకిస్తారా?
Recommended Video
అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశ పెడుతున్న 2018-19 బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. పోలవరం ప్రాజెక్టుకు, రాజధాని అమరావతికి భారీగా నిధులు, విశాఖ రైల్వే జోన్ తదితరాలతో పాటు రైల్వే ప్రాజెక్టుల విషయంలోను నవ్యాంధ్ర ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.
ఇటీవల రైల్వే అధికారులు ఎంపీలతో సమావేశమై ప్రతిపాదనలు కోరారు. అయితే ఇంత ఆలస్యంగా ప్రతిపాదనలు తీసుకోవడం ఏమిటని ఎంపీలు రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు రైల్వే, అమరావతికి నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు సహా ఏపీ పలు డిమాండ్లు కేంద్రం ముందు పెట్టింది.
కేంద్రం వరాలు: కార్పోరేట్ పన్ను 2శాతం తగ్గింపు, ఉద్యోగుల ఈపీఎఫ్ వాట ఇలా
ఏపీపై బడ్జెట్లో కనిపించని సానుకూలత
విభజన నేపథ్యంలో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం ఏమాత్రం సానుకూలత ప్రదర్శించలేదని ఈ బడ్జెట్లో తేలిపోయిందని అంటున్నారు. ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెడితే.. ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు నిధులపై ఆశించినట్లుగా లేదని అంటున్నారు.
పోలవరం, అమరావతి ఊసులేదు
బడ్జెట్లో అమరావతి, పోలవరం ఊసు కనిపించలేదు. ఇది తెలుగుదేశం పార్టీకి ఊహించని పరిణామమే అంటున్నారు. ఇప్పటికే ఏపీలో బీజేపీ - టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. 2019కి కలిసి ఉంటారా విడిపోతారా అనే చర్చ ఇప్పటికే సాగుతోంది.
చంద్రబాబు షాకిస్తారా
ఇలాంటి పరిస్థితుల్లో జైట్లీ బడ్జెట్ ఐపీకి ఊరటనివ్వలేదు. దీంతో చంద్రబాబు ఊహించని నిర్ణయం ఏమైనా తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇటీవల మరోసారి ప్రతిపాదనల కోసం కేంద్రం ఏపీని అడిగింది. దీంతో ఏపీ ఆశలు పెట్టుకుంది. కానీ ఆ ఆశలు ఫలించలేదు.
టీడీపీ నేతల అనుమానం
జైట్లీ ఏపీకి మళ్లీ మొండి చెయ్యి చూపించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యేలా ఉన్నాయి. నవ్యాంధ్ర ప్రజలు నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ గురించి జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించకపోవడంపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే జోన్ కేటాయిస్తామని గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ఏమైందంటూ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఎక్కడా వినిపించని తెలుగు రాష్ట్రాల పేర్లు
బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా తెలుగు రాష్ట్రాల పేర్లు వినిపించలేదు. తెలుగు ప్రజలు సోషల్ మీడియాలో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే విషయంలో తెలుగు రాష్ట్రాల పేర్లు ప్రస్తావించని జైట్లీ.. బెంగళూరు మెట్రోకు 17వేల కోట్లు, ముంబై సబర్బన్ రైల్వేకు 17వేల కోట్లు కేటాయించడం గమనార్హం. అన్ని రైళ్లలోనూ, రైల్వే స్టేషన్లలోనూ ఉచిత వైఫై సేవలు అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ చెప్పారు.
ఏపీకి ఇవి వచ్చాయి.
డ్రెడ్జింగ్ కార్పోరేషన్కు రూ.19.62 కోట్లు. విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు. ఏపీలో ఐఐపీఈకి రూ.32 కోట్లు. ఐఐఎస్సీఆర్కు రూ.49 కోట్లు. ఐఐటీకి రూ.50 కోట్లు. గిరిజన వర్సిటీకి రూ.10 కోట్లు. ఎన్ఐటీకి రూ.54 కోట్లు. కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు. ఆదర్శ రైల్వే స్టేషన్ల జాబితాలో మార్కాపురం రోడ్డు, రాజమండ్రి, దొనకొండ, ఒంగోలు, ఆదోనిలు ఉన్నాయి. విశాఖ, బొబ్బిలి, పార్వతీపురం, విశాఖ, కడప, తిరుపతి, మచిలీపట్నం, విజయవాడ రైల్వే స్టేషన్లకు ప్రత్యేక అభివృద్ధి. రేణిగుంట, బేతంచర్ల, ధర్మవరం ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం.
నల్లపాడు -గుంతకల్లు రైల్వే లైన్ విద్యుదీకరణకు రూ.150 కోట్లు. అరకు, సిమిలిగూడ ప్లాట్ఫాంల విస్తరణ. కోటిపల్లి-నర్సాపూర్ కొత్త రైల్వే లేన్కు రూ.430 కోట్లు. నడికూడి - శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్కు రూ.340 కోట్లు. కాజీపేట - విజయవాడ మూడో రైల్వే లైన్కు రూ.100 కోట్లు. విజయవాడ - సంభల్పూర్ మూడో రైల్వే లైనుకు రూ.90 కోట్లు. ఎస్ కోట, శివలింగాపురం, బొద్దవరం, బొర్రాగుహలు, పుల్లంపేట, ఇచ్చాపురం, సాలూరు, లక్కవరపుకోట, మార్కాపురం, పాకాల, నక్కలదొడ్డిల ఫ్లాట్ ఫాంల విస్తరణ.