మూడేళ్ళలో ఏపీకి ఎంతో చేశాం, ఆ సిఫారసు మేరకే, ఆ పార్టీకి చిత్తశుద్ది లేదు: హరిబాబు
అమరావతి:ఏపీ పునర్విభజన చట్టంలో లేని అంశాలను కూడ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని బిజెపి ఎంపీ కంభంపాటి హరిబాబు చెప్పారు. పదేళ్ళపాటు ఏపీ రాష్ట్రానికి రెవిన్యూలోటును భర్తీ చేస్తామని కేంద్రం హమీ ఇచ్చిన విషయాన్ని హరిబాబు గుర్తు చేశారు.
ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం ముగిసిన తర్వాత హరిబాబు న్యూఢిల్లీలో బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడారు.
కేంద్రం పాత పాటే పాడింది, జైట్లీ ప్రకటనపై అసంతృప్తి
ఏపీ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను చేస్తోందని హరిబాబు అభిప్రాయపడ్డారు. కేంద్రం నుండి నిధులను రాబట్టేందుకు తాము అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తున్నట్టు ఆయన గుర్తు చేశారు.
రెవిన్యూలోటును కేంద్రం భరిస్తోంది
రెవిన్యూలోటును భరిస్తామని కేంద్రం హమీ ఇచ్చిన విషయాన్ని బిజెపి ఎంపీ హరిబాబు గుర్తు చేశారు. 10 సంవత్సరాల పాటు రెవెన్యూలోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని హరిబాబు ప్రస్తావించారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలతో పాటు పొందుపర్చని అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని హరిబాబు చెప్పారు.2015-16 ఏడాదికిగానూ ఆర్థిక సంఘం సుమారు రూ.6600 కోట్ల రూపాయలు వచ్చిందని అంచనా వేసిందని అన్నారు. రెవెన్యూ లోటును కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తూనే ఉందని అన్నారు.
3 ఏళ్ళలో ఏపీకి నిధులు
మూడేళ్ళలో ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులను ఏపీ రాష్ట్రానికి కేటాయించినట్టుగా బిజెపి ఎంపీ హరిబాబు చెప్పారు.కాగా, ప్రత్యేక హోదాకు బదులు సాయం చేస్తామని జైట్లీ ప్రకటించారని అన్నారు. విదేశాల నుంచి ఏపీ తేలికగా రుణాలు పొందడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోందని చెప్పారు.
14వ, ఆర్థిక సంఘం సూచన మేరకే
14 వ ఆర్థిక సంఘం ప్రత్యక హోదా కాకుండా ప్రత్యేక సాయం ఇవ్వాలని సూచించిందని బిజెపి ఎంపీ హరిబాబు చెప్పారు. ఈ సూచనల మేరకే కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు. ఏపీలో పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సాయం కోరితే తప్పకుండా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని అన్నారు.
ప్రత్యేక హోదాపై కాంగ్రెస్కు చిత్తశుద్ది లేదు
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది లేదని బిజెపి ఎంపీ హరిబాబు ఆరోపించారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్కు చిత్తశుద్ది ఉంటే ఏపీ పునర్విభజన చట్టంలోనే ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చేవారని హరిబాబు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాను అమలు చేస్తామని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటన చేయడంపై హరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల మాటలను ప్రజలు నమ్మరని హరిబాబు చెప్పారు.