జగన్ సర్కార్కు బిగ్ రిలీఫ్?: మూడు రాజధానులపై కేంద్రం ఫుల్ క్లారిటీ: హైకోర్టులో కౌంటర్
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో ఇప్పటికే ముప్పేటదాడిని ఎదుర్కొంటోన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించడం ఖాయంగా కనిపిస్తోంది. అటు ప్రతిపక్షాల నుంచి ఘాటు విమర్శలు, ఇటు అమరావతి ప్రాంత రైతుల నుంచి అదే స్థాయిలో నిరసనలు, ఆందోళనలతో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న జగన్ ప్రభుత్వానికి ఊరట కలిగించే అంశం ఇది. ఇదివరకు పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసిన విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర రాజధానులను నిర్ణయించే అధికారం పూర్తిగా ఆయా రాష్ట్రాల పరిధిలోనే ఉన్నాయని స్పష్టం చేసింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం: వాయుగుండంగా?: ఏపీలో నాలుగు రోజుల పాటు మరిన్ని వర్షాలు
రాష్ట్రం పరిధిలోనే..
రాజధానిని ఎక్కడ నిర్ణయించాలనే విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో కేంద్రం పాత్ర ఉండదని పేర్కొంది. ఎక్కడి నుంచి పరిపాలించాలనే విషయాన్ని తాము నిర్దేశించలేమని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలు.. తమకు అనువైన ప్రాంతంలో నుంచి గానీ, అభివృద్ధి చేయాలని భావించిన ప్రాంతం నుంచి గానీ పరిపాలనను కొనసాగించవచ్చని పేర్కొంది. దీనిపై పూర్తి అధికారాలు రాష్ట్రాల ప్రభుత్వాలదేనని వెల్లడించింది.
హైకోర్టులో కౌంటర్..
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంపై ఏపీ హైకోర్టులో దాఖలైన పలు పిటీషన్లపై విచారణ సందర్భంగా ఈ అఫిడవిట్ను సమర్పించింది కేంద్ర ప్రభుత్వం. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు దాఖలు చేసిన పిటీషన్లను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు.. కేంద్రానికి కూడా నోటీసులను జారీ చేసిన విషయం తెలిసిందే. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే విషయంపై కేంద్రం అభిప్రాయాన్ని కోరింది. కౌంటర్ అఫిడవిట్ను దాఖలు చేయాలని ఆదేశించింది.
కౌంటర్ అఫిడవిట్లో కీలకాంశాలు.. కామెంట్లు..
హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కౌంటర్ అఫిడవిట్ను దాఖలు చేసింది. రాష్ట్రాల రాజధానులను నిర్ణయించడంలో కేంద్ర పాత్ర ఏ మాత్రం లేదని కుండబద్దలు కొట్టింది కేంద్రం. అంతేకాదు- చట్టసభల్లో చర్చించిన అంశాలు కూడా న్యాయ పరిధిలోకి రావని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చాక కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవచ్చని, పరిపాలనలో భాగంగా ఎదురైన పరిస్థితులను బట్టి నిర్ణయాలను తీసుకోవచ్చని కేంద్రం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
Recommended Video
బీజేపీ సానుకూలంగా ఉన్నట్టేనా?
ఇదివరకు నిండు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మూడు రాజధానులపై ఓ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ సభ్యుడు గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ ఓ స్పష్టత ఇచ్చారు. రాష్ట్రాల రాజధానుల విషయం పూర్తిగా కేంద్రం పరిధిలోనే ఉందని అప్పట్లోనే ఓ ప్రకటన చేశారు. తాజాగా రాష్ట్రాల రాజధానుల విషయంతో తమకు ఏ మాత్రం సంబంధం లేదంటూ కొద్దిరోజుల కిందటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే.. మూడు రాజధానుల అంశంపై బీజేపీ తన వైఖరిని స్పష్టం చేసినట్టయింది.