ఏపీలో పరిస్థితి ఏంటి?: సీఎం వైఎస్ జగన్కు కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఫోన్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై చర్చించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరీక్షలు జరపడంపై దృష్టి పెట్టామని ఈ సందర్భంగా సీఎం జగన్ కేంద్రమంత్రికి వివరించారు.
రోజుకు 22 వేలకు పైగా టెస్టులు జరుపుతున్నామని తెలిపారు. వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించి, బాధితులకు త్వరితగతిన చికిత్స అందిస్తున్నామని జగన్ చెప్పారు. ప్రస్తుతం 1.17 శాతంగా ఉన్న మరణాల రేటును 1 శాతం కంటే దిగువకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు.
కాగా, కరోనాపై పోరుకు రూ. 179 కోట్లు కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి ఇచ్చినట్లు హర్షవర్ధన్ వెల్లడించారు. కేసులు అధికంగా నమోదు అవుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్యమంత్రులతో హర్షవర్ధన్ ఫోన్ ద్వారా మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో బుధవారం మాట్లాడారు. ఇంతకుముందు ఆయన కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో ఆయన మాట్లాడారు.
ఇక ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 22,197 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2432 మందికి పాజిటివ్ అని తేలింది. కాగా, బుధవారం ఒక్కరోజే 44 మంది మృతి చెందారు. తాజా కరోనా పాజిటివ్ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 35,451కు చేరింది. 16,621 యాక్టివ్ కేసులున్నాయి. 18,378 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 452 మంది కరోనా బారినపడి మరణించారు.