లాక్డౌన్ పొడిగించాలా? వద్దా?: వైఎస్ జగన్కు అమిత్ షా ఫోన్: కరోనా కేసులు భారీగా నమోదవుతోన్న వేళ..
అమరావతి: వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో 1097 కరోనా వైరస్ పాజిటివ్ నమోదు కాగా.. ఇందులో 450 కేసులు వారంరోజుల్లోనే రికార్డు అయ్యాయి. ఆదివారం నాడు కూడా 81 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో వెలుగు చూశాయి. ఇలాంటి పరిణామాల మధ్య కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Recommended Video
ప్రభుత్వ చర్యలపై ఆరా..
ఈ సందర్భంగా వారిద్దరి మధ్య కరోనా వైరస్ కేసులు, లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, మహమ్మారిని నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలు.. పోలీసుల పనితీరు వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కరోనా పేషెంట్లకు ప్రభుత్వం అందిస్తోన్న వైద్య చికిత్స, ఆసుపత్రులు, వైరస్ పరీక్షల కోసం ఉద్దేశించిన ల్యాబొరేటరీల గురించి అమిత్ షా ఆరా తీసినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ ఎత్తేసిన తరువాత సంభవించే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలనే విషయంపైనా అమిత్ షా, వైఎస్ జగన్ చర్చించినట్లు సమాచారం.
లాక్డౌన్ పరిణామాలను పర్యవేక్షిస్తోన్న హోం శాఖ..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని పర్యవేక్షిస్తోన్నది కేంద్ర హో మంత్రిత్వ శాఖే. లాక్డౌన్ను మరింత కట్టుదిట్టం చేయాల్సి వచ్చినా.. దాన్ని సడలింపును ఇవ్వదలిచినా అది ఆ శాఖ తీసుకునే నిర్ణయం మీదే ఆధార పడి ఉంటుంది. దీనిపై ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రుల నుంచి అభిప్రాయాల సేకరణ..
కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా తరచూ ఫోన్లో సంభాషిస్తున్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటోన్న చర్య గురించి ఆరా తీస్తున్నారు. లాక్డౌన్ కొనసాగింపుపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను ఆయన సేకరిస్తున్నారు. లాక్డౌన్ పొడిగించాల్సిన పరిస్థితి ఎదురైతే.. దాన్ని ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉండాలనే సంకేతాలను అమిత్ షా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇస్తున్నారు.
ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేలా..
19 రోజుల రెండోదశ లాక్డౌన్ వచ్చేనెల 3వ తేదీ నాటికి ముగుస్తున్నందున.. ఆ తరువాత కేంద్రం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే అమిత్ షా.. వైఎస్ జగన్కు ఆదివారం ఉదయం ఫోన్ చేశారు. లాక్డౌన్ వల్ల సంభవించే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ పరిణామాలు, తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.
కరోనా పరీక్షల గురించి వివరించిన జగన్..
రాష్ట్రంలో చేపట్టిన కరోనా వైరస్ పరీక్షల గురించి వైఎస్ జగన్ ఈ సందర్భంగా అమిత్ షాకు వివరించారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే అతి తక్కువ వనరులు ఉన్నప్పటికీ.. ఏపీలో ప్రతి 10 లక్షల జనాభాకు అత్యధిక పరీక్షలను నిర్వహించినట్లు వివరించినట్లు స్పష్టం చేసింది. రాష్ట్రం తీసుకుంటున్న చర్యల పట్ల అమిత్ షా సంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. వైరస్ కట్టడికి మరింత కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.