ఏపీతో నాకు బంధుత్వం: టీడీపీకి కేంద్రమంత్రి విజ్ఞప్తి, మోడీ చరిత్రలో నిలుస్తారని శివప్రసాద్
ఢిల్లీ: ఏపీతో తనకు దగ్గరి బంధుత్వం ఉందని కేంద్రమంత్రి అనంత్ కుమార్ గురువారం అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు వెంటనే నెరవేర్చాలంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోకసభలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అనంత్ కుమార్ మాట్లాడారు. ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.
పవన్ కళ్యాణ్పై జగన్ వ్యాఖ్యలు, కాపునాడు తీవ్ర హెచ్చరిక
కేంద్రమంత్రి వినతికి టీడీపీ నో
దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ స్పందించారు. ఎంపీలు ఆందోళన విరమించి ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని కోరారు. కూర్చొని నిరసన తెలపవచ్చునని అన్నారు. ఆయన విజ్ఞప్తిని తిరస్కరించిన తెలుగుదేశం పార్టీఎంపీలు ప్రత్యేక హోదా పైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగుతుందని తెలిపారు.
ఏపీతో నాకు బంధుత్వం ఉంది
దీనికి అనంత్ కుమార్ స్పందిస్తూ.. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి తనకు తెలుసునని చెప్పారు. ఆ రాష్ట్రంతో తనకు దగ్గర బంధుత్వం ఉందని చెప్పారు. కర్ణాటకకు చెందిన అనంత్ కుమార్ ప్రస్తుతం బెంగళూరు దక్షిణ నియోజకవర్గ ఎంపీగా ఉన్నారు.
ఆర్ధర్ కాటన్ వేషధారణలో చిత్తూరు ఎంపీ
అంతకుముందు, ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని కోరుతూ టీడీపీ ఎంపీలు పార్లమెంటు బయట ఆందోళన చేశారు. పార్లమెంటు ఆవరణలో ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సర్ ఆర్థర్ కాటన్ వేషధారణలో ఆందోళనలో పాల్గొన్నారు.
మోడీ చరిత్రలో నిలిచిపోతారు
బ్రిటీష్ ఇంజినీరైన కాటన్ ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం అయ్యేలా చేస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకెంత చేయాలని శివప్రసాద్ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తే మోడీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. పార్లమెంటుకు ఎంతోమంది వచ్చారు, వెళ్లారు.. మీరు కూడా పోతారని కానీ మనిషిగా వెళ్లండన్నారు. మొండి వైఖరితో ముందుకెళ్తే ప్రజలు చూసుకుంటారన్నారు.