ఏపీలో 13 నగరాలు కాలుష్య కోరల్లో, ఆ నగరాలివే..: 24నాటికి 63లక్షల కుళాయిల కనెక్షన్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 నగరాలు కాలుష్యం బారినపడినట్లు కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో వెల్లడించారు. రాజ్యసభలో వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ఏపీలోని ఈ 13 నగరాల్లో గాలి నాణ్యత శూన్యం
2014-18 మధ్య దేశంలో వివిధ నగరాలలో గాలి నాణ్యతపై జరిపిన అధ్యయనంలో ఏపీలోని 13 నగరాల్లో కాలుష్యం పెరిగినట్లు తేలిందని మంత్రి తెలిపారు. అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నగరాల్లో స్వచ్ఛమైన గాలి నాణ్యత అత్యల్పంగా ఉన్నట్లు గుర్తించామని కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో తెలిపారు.
ఇవే ప్రధాన కారణాలు..
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్(ఎన్కాప్) కింద కాలుష్యం బారిపడిన నగరాల్లో కాలుష్యం వెదజల్లేందుకు ప్రధాన కారణాలను గుర్తించడానికి పలు అధ్యయనాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రోడ్లపై ఆవరించే ధూళి కణాలు, వాహన కాలుష్యం, చెత్త తగులబెట్టడం, నిర్మాణ, కూల్చివేత పనులు, పారిశ్రామిక కాలుష్యం వంటి నగరాలలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా గుర్తించినట్లు కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో రాజ్యసభలో వివరించారు. ఈ నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుప్చేందుకు నగరాల వారీగా ప్రణాళికలు రూపొందిస్తున్టన్లు కేంద్రమంత్రి తెలిపారు.
Recommended Video
2024 నాటికి 63లక్షలకుపైగా కుళాయి కనెక్షన్లు..
ఇది ఇలావుండగా, జల జీవన్ మిషన్(జేజేఎం) కింద 2024 నాటికి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రమంత్రి రతన్ లాల్ కటారియా తెలిపారు.రాజ్యసభలో సోమవారం వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని 63లక్షల 72వేల ఇళ్లకు 2024 నాటికి కుళాయి కనెక్షన్ కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం వార్షిక ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రణాళిక కింద ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి రాష్ట్రంలో 31 లక్షల 93వేల ఇళ్లకు కుళాయి నీటి సదుపాయం కల్పించినట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి తెలిపారు. కరోనా కారణంగా జల జీవన్ మిషన్ పనులకు ఆటంకం ఏర్పడిందన్నారు. ఇప్పుడు అన్లాక్లో భాగంగా నిర్మాణ పనుల పునర్ ప్రారంభానికి కేంద్ర హోంశాఖ అనుమతించిన నేపథ్యంలో జల జీవన్ మిషన్ పనులను తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో కోటి 32 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్ సదుపాయం కల్పించినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగడానికి రాష్ట్రాలకు తగిన నిధులు అందుబాటులో ఉంచినట్లు కేంద్రమంత్రి తెలిపారు.