బాబు ఎన్డీయే నుంచి బయటకు రావడానికి కారణం ఇదీ: కేంద్రమంత్రి దిమ్మతిరిగే షాక్! హోదాపై..
అమరావతి/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయని కేంద్రమంత్ిర జితేంద్ర సింగ్ అన్నారు. ఏపీపై ప్రధాని నరేంద్ర మోడీకి ఎలాంటి వివక్ష లేదని తేల్చి చెప్పారు. అందుకే ప్రత్యేక హోదా కాకుండా అందుకు సమానమైన ప్యాకేజీని ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పడ్డా, హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు.
జగన్ ఆస్తులు ఎందుకు జఫ్తు చేయట్లేదు, మా జోలికొస్తే.. ఖబడ్దార్!: మోడీకి బాబు తీవ్ర హెచ్చరిక
టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిందన్నారు. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో మోడీ ఇచ్చిన హామీని విస్మరిస్తారా? అని కేంద్రమంత్రిని మీడియా నిలదీసింది. దీనికి ఆయన సమాధానం చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వకున్న హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నీ కల్పిస్తామన్నారు. ఏపీకి సాయం అందించే విషయంలో కేంద్రం ఏనాడు వెనకడుగు వేయలేదన్నారు.
రూ.350 కోట్లు వెనక్కి తీసుకోలేదని చంద్రబాబుకు కౌంటర్
ఏపీలో వెనుకబడిన జిల్లాల కోసం ఇచ్చిన రూ.350 కోట్ల నిధులను వెనక్కి తీసుకోవడంపై మీడియా ప్రశ్నించగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ఆ నిధులను కేంద్రం వెనక్కి తీసుకోలేదని, ఈ నిధులు ఇవ్వడానికి తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రాజధాని అమరావతికి రూ.2500 కోట్లు ఇచ్చామన్నారు. మరిన్ని నిధులు విడుదల చేసేందుకు సిద్ధమన్నారు.
టీడీపీ నేతలు మాట్లాడొచ్చు కానీ, అమిత్ షా మాట్లాడవద్దా?
పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కేంద్రం కారణం కాదని జితేంద్ర సింగ్ చెప్పారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమన్నారు. వినియోగ పత్రాలపై టీడీపీ నేతలు మాట్లాడినప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సమాధానం చెబితే తప్పేమిటని టీడీపిక గట్టి కౌంటర్ ఇచ్చారు. యూసీలపై అమిత్ షా మాట్లాడటం ఏమిటని చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రశ్నించారు. దీనికి జితేంద్ర సింగ్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.
అందుకే ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటకు
నాలుగేళ్ల పాటు తమతో కలిసి ఉన్న చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్డీయే నుంచి బయటకు వచ్చారని జితేంద్ర సింగ్ అన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీపై ఆరోపణలు, నిందలు వేసి రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. ఆయన ఏపీలో చేసిందేమీ లేదని, బీజేపీని విమర్శించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారని అభిప్రాయపడ్డారు.
టీడీపీ, బీజేపీ మాటల యుద్ధం
కాగా, ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చాక బీజేపీకి టిడిపికి మధ్య మాటల యుద్ధం సాగుతోన్న విషయం తెలిసిందే. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఏపీకి నాలుగేళ్ల పాటు ఏం సాయం చేయలేదని టీడీపీ చెబుతుండగా, గతంలో ఏపీకి చేసిన సాయం మరే రాష్ట్రానికి మోడీ చేయలేదని ప్రకటించిన చంద్రబాబు క్లిప్పింగులు, వెంకయ్యకు సన్మానం చేసిన అంశాలను బీజేపీ గుర్తు చేస్తోంది. తద్వారా రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారని చెబుతున్నారు.