బీజేపీ బుజ్జగింపులు షురూ: ఏపీకి జైశంకర్..సురేష్ ప్రభు: విశాఖ ఉక్కుపై కేంద్రం విధానమేంటీ?
అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగడమే లక్ష్యంగా పనిచేస్తోంది భారతీయ జనతా పార్టీ. దీనికోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటోంది. 2024లో నిర్వహించబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించడంపైనే పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటున్నారు. 2024 టార్గెట్ను ఛేదించడానికి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికను అగ్నిపరీక్షగా భావిస్తున్నారు. ఈ లోక్సభ ఉప ఎన్నికతో పార్టీ బలంపై ఒక అంచనా ఏర్పడుతోందనేది బీజేపీ రాష్ట్రశాఖ నేతల అభిప్రాయం.
నిమ్మగడ్డ టూర్ ఎఫెక్ట్?: టీటీడీ జేఈఓపై బదిలీ వేటు: నో పోస్టింగ్: జీఏడిలో రిపోర్ట్
దూకుడుకు బడ్జెట్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనలు బ్రేక్..
బీజేపీ రాష్ట్రశాఖ నాయకుల దూకుడు వైఖరికి సడన్ బ్రేకులు పడుతున్నాయి. ఒకటి- మొన్నటి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు ఆశించిన స్థాయిలో లేకపోవడం..రెండు- ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే ప్రతిపాదనలను తీసుకుని రావడం. ఈ రెండింటికీ రాష్ట్ర ప్రజలకు సమాధానాన్ని చెప్పాల్సిన బాధ్యతను ఎదుర్కొంటోంది బీజేపీ. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీ వాటా ఎంత? అనే విషయాన్ని వివరించడంతో పాటు విశాఖ ఉక్కు కంపెనీ నుంచి పెట్టుబడులను ఉపసంహరించడానికి గల కారణాలను వెల్లడించడానికి సన్నాహాలు చేస్తోంది.
మేధావుల సమావేశం పేరుతో..
దీనికోసం బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు మేధావుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శని, ఆదివారాల్లో ఈ భేటీలు కొనసాగబోతోన్నాయి. విజయవాడ, గుంటూరు, ఏలూరు, తిరుపతిల్లో వాటిని ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్..రైలేశాఖ మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. విజయవాడలో నిర్వహించే మేధావుల సమావేశానికి జైశంకర్, తిరుపతిలో ఏర్పాటు చేసే భేటీకి సురేష్ ప్రభు హాజరవుతారు. అంతకుముందు- శనివారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని బీజేపీ రాష్ట ప్రధాన కార్యాలయంలో జైశంకర్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.
వ్యూహాత్మకంగా తిరుపతిలో..
సురేష్ ప్రభు పాల్గొనబోయే మేధావుల సమావేశాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయడం వెనుక బీజేపీ వ్యూహాం ఉందనేది బహిరంగ రహస్యం. తిరుపతి లోక్సభ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నికలు రానున్నాయి. బడ్జెట్లో ఆశించిన విధంగా కేటాయింపులు లేవంటూ వెలువడుతోన్న వార్తలు ఈ ఉప ఎన్నికపై కొద్దో, గొప్పో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదనేది బీజేపీ నేతల అంచనా. అందుకే- తిరుపతిలోనే మేధావుల సమావేశాన్ని ఏర్పాటు చేసి.. కేంద్ర మాజీమంత్రి సురేష్ ప్రభు ద్వారా వివరణ ఇప్పించాలనేది బీజేపీ నేతల అభిప్రాయంగా చెబుతున్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై
ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయం ప్రస్తావనకు వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. దీనికి అవసరమైన సమాధానాలు, వివరణలను సిద్ధం చేసుకుంటున్నారు. జాతీయ స్థాయిల కేంద్ర ప్రభుత్వం పెట్టబడులను ఉపసంహించుకుంటోందనే కారణాన్ని ప్రధానంగా వివరించే అవకాశం ఉందని సమాచారం. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం కొత్తదేమీ కాదని, ఇదివరకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలోనూ అమలు చేసిన విషయాన్ని వివరిస్తారని, ప్రైవేటీకరించడానికి గల సహేతుక కారణాన్ని వివరిస్తారని అంటున్నారు.