ఏపీ, తెలంగాణ రాజకీయాలపై కన్నేసిన బీజేపీ జెయింట్ కిల్లర్
అమరావతి: ఎవరు ఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయినా మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ డీలా పడింది. ఎన్నికల పరాజయ పరాభవం నుంచి తేరుకోలేకపోతోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ వెన్నుదన్నుగా ఉంటూ వస్తోన్న సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి బడా నేతలే కాకుండా.. పలువురు జిల్లా స్థాయి నాయకులు పార్టీని వీడటం.. టీడీపీలో నెలకొన్న పరిస్థితులకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. టీడీపీ నేతలంతా ప్రత్యామ్నాయంగా భారతీయ జనతాపార్టీ వైపు చూపులు సారిస్తున్నారు. ఫలితంగా- క్రమంగా కమలనాథులు రాష్ట్ర రాజకీయాల్లో బలోపేతమౌతున్నారు. అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరలేక.. ఇటు టీడీపీలో కొనసాగలేని నాయకులంతా కాషాయకండువాను కప్పుకొంటున్నారు.
బ్రాహ్మణి స్టీల్స్ లో కదలిక: ప్లాంట్ ను పరిశీలించిన విదేశీ సంస్థ: టేకోవర్ పై ఆసక్తి!
టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నం..
ఈ నేపథ్యంలో- బీజేపీలో కాస్త పేరున్న నేతలంతా ఏపీ రాజకీయాల్లో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాస్త గట్టిగా ప్రయత్నిస్తే.. 2014 ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీని ఢీ కొట్టగలిగే స్థాయికి చేరుకోవచ్చని ఆశిస్తున్నారు. తాజాగా- కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఏపీ రాజకీయాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఏపీతో పాటు తెలంగాణపైనా ఆమె దృష్టి సారించినట్లు సమాచారం. తాజాగా- స్మృతి ఇరానీ చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది. కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ ఇటీవలే- `సమర్థ్` పథకాన్ని ఆరంభించారు. ఏపీ, తెలంగాణలతో పాటు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు ఈ పథకంలో చేరాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తూ.. తెలుగులో ఓ ట్వీట్ చేశారు స్మృతి ఇరానీ.
సమర్థ్ పథకంతో సమర్థవంతంగా..
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలు, దేవాలయాలపై చిత్రీకరించిన ఓ వీడియోను ఈ ట్వీట్ కు జోడించారు. సమర్థ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంత భాగస్వామ్యాన్ని అందించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ‘సమర్ధ్' పథకం కింద ఏపీలో 12 వేల మంది యువతకు దుస్తుల తయారీలో నైపుణ్యాలను పెంపొందించుకొనేందుకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. బీజేపీ సహకారంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు 12 వేల మంది యువతను ఎంపిక చేయాల్సి ఉంటుందనేది ట్విస్ట్. ఈ సమర్థ్ పథకాన్ని వినియోగించుకుని, పెద్ద ఎత్తున యువతకు గాలం వేయాలని బీజేపీ అధిష్ఠానం నుంచి రాష్ట్రశాఖ నాయకులకు సమాాచారం అందిందని చెబుతున్నారు.
మోడీ-షా ద్వయాన్ని చూపి.. యువతను ఆకట్టుకునే ప్రయత్నం
ఇప్పటికే- నరేంద్ర మోడీ ఛరిష్మాను పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు బీజేపీ నాయకులు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదాగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం.. యువతను పెద్ద సంఖ్యలో బీజేపీ వైపు మొగ్గు చూపేలా చేసింది. ఏపీ, తెలంగాణ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. జమ్మూ కాశ్మీర్ ను అఖండ భారతావనిలో విలీనం చేసేలా నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారని అంటూ బీజేపీ నాయకులు స్వామి కార్యాన్ని, స్వకార్యాన్ని నెరవేర్చుకునే పనిలో పడ్డారు. యువతలో దేశభక్తిని నింపే ప్రయత్నం చేస్తూనే, పనిలో పనిగా నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వం దేశానికి ఎంత అవసరమో తెలియజేసే పనిలో పడ్డారు.
ఏపీ, తెలంగాణల్లో స్మృతి ఇరానీ పర్యటన?
ఇదే ప్రధాన టార్గెట్ గా.. త్వరలోనే స్మృతి ఇరానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించవచ్చని తెలుస్తోంది. సమర్థ్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి సంబంధిత శాఖ మంత్రిగా స్మృతి ఇరానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించే అవకాశం ఉందని బీజేపీ నాయకులు అంటున్నారు. ఈ పథకాన్ని అడ్డుగా పెట్టుకుని పార్టీని క్షేత్ర స్థాయిలో విస్తరింపజేయాలనేది తమ ఉద్దేశమని బీజేపీ నేతలు చెప్పకనే చెబుతున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన కంచుకోట ఉత్తర ప్రదేశ్ లోని అమేథీలో ఓడించిన ఘనత స్మృతి ఇరానీకి ఉంది. రాహుల్ గాంధీపై ఆమె సాధించిన గెలుపు.. జెయింట్ కిల్లర్ అనే గుర్తింపును తీసుకొచ్చింది. అదే ఊపును ఆమె ఏపీ, తెలంగాణలో కనపర్చుతారని, పార్టీని బలోపేతం చేయడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ‘సమర్ధ్’ పథకం కింద ఆంధ్ర ప్రదేశ్ లో 12,000 మంది యువతకు దుస్తుల తయారీ లో నైపుణ్యాలను పెంపొందించుకొనేందుకు శిక్షణ ఇస్తారు. pic.twitter.com/KiIOZuI1yQ
— Smriti Z Irani (@smritiirani) August 14, 2019
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ‘సమర్ధ్’ పథకం కింద తెలంగాణా లో 1440 మంది యువతకు దుస్తుల తయారీ లో నైపుణ్యాలను పెంపొందించుకొనేందుకు శిక్షణ ఇస్తారు. pic.twitter.com/Isv2q1raQ9
— Smriti Z Irani (@smritiirani) August 14, 2019