ఏపీది తొలి స్థానం, అక్కడా ఇక్కడా పని రాక్షసులే: బాబుపై వెంకయ్య, జైట్లీ
సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.
విశాఖపట్నం: సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. విశాఖపట్నంలో శుక్రవారం సీఐఐ పార్ట్నర్షిప్ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సదస్సులో 50దేశాలకు చెందిన 400మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సులో సుమారు 400ల పారిశ్రామిక ఎంఓయూలను ఏపీ ప్రభుత్వం కుదుర్చుకునే అవకాశం ఉంది.
ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. భవిష్యత్లో ఏపీ మరింత వృద్ధి రేటు సాధిస్తుందని అన్నారు. పోలవరం పూర్తయితే ఏపీకి ఇక తిరుగే ఉండదని అన్నారు. ఏపీ ఏటా రెండంకెల వృద్ధి రేటు నమోదు చేస్తోందని చెప్పారు.
దేశంలో సమర్థ నాయకత్వం: ఏపీ అభివృద్ధి బాబు వల్లే
భారతదేశంలో బలమైన నాయకుడు నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నారని, సుస్థిరమైన ప్రభుత్వం ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఇప్పుడు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తోందని చెప్పారు. భారతదేశం.. ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిపైనే దృష్టి సారించాయని అన్నారు. అభివృద్ధి కోరుకునే ఇద్దరు నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధిపతులుగా ఉన్నారని అన్నారు.
దేశ సమ్మిళిత వృద్ధి కోసం మోడీ కృషి చేస్తున్నారని వెంకయ్య చెప్పారు. అభివృద్ది కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్నారు. రాష్ట్రాల మధ్య అభివృద్ధిలో పోటీ నెలకొని ఉందని అన్నారు. కేంద్రం సంస్కరణలకు ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. పెట్టుబడులకు దేశంలో అనుకూల వాతావరణం ఉందని చెప్పారు.
చంద్రబాబు వల్లే అభివృద్ధి
చంద్రబాబునాయుడు సమర్థనాయకుడు కాబట్టే ఏపీ రెండంకెల వృద్ధిరేటు దాటిందని వెంకయ్య తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో ఎంతో మేలు జరిగిందని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఇబ్బందులున్నా.. రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని వెంకయ్య ప్రశంసించారు. చంద్రబాబుకు పని తప్ప వేరే పని ఉండదని అన్నారు.
విభజన తర్వాత ఏపీ చిన్న రాష్ట్రం ఏర్పడిందని, చంద్రబాబు ఏపీని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు వల్లే ఏపీ అన్ని రంగాల్లో ముందుందని వెంకయ్య చెప్పారు. రాష్ట్రంలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలతోపాటు మరో మూడు విమానాశ్రయాలున్నాయని చెప్పారు. రాష్ట్రంలో విమానాశ్రయాలు, రవాణా వ్యవస్థ బాగుందని అన్నారు.
పెద్ద నోట్ల రద్దు
అనేక సమస్యలకు పెద్ద నోట్ల రద్దు పరిష్కారం చూపిందని చెప్పారు. నల్లధనం, నకిలీ కరెన్సీకి చెక్ పెట్టడం జరిగిందని అన్నారు. నోట్ల రద్దుపై నల్లకుబేరులే ఆందోళన చెందారని అన్నారు.
నోట్ల రద్దుతో దీర్ఘకాలిక ప్రయోజనాలున్నాయని తెలిసే.. ప్రజలు నరేంద్ర మోడీకి అండగా నిలిచారని అన్నారు. 50రోజులపాటు సమయం ఇవ్వాలని ప్రధాని కోరగానే.. ప్రజలు ఏటీఎంలు, బ్యాంకుల ముందు ఎలాంటి నిరసనలు తెలపకుండా నిలుచున్నారని చెప్పారు.
దేశంలో 100 స్మార్ట్ సిటీలు తయారవుతున్నాయని, అమృత నగరాలు కూడా నెలకొంటున్నాయని చెప్పారు. ఇవన్నీ పరిశ్రమలకు, పెట్టుబడులకు అనుకూలంగా మారనున్నాయని చెప్పారు.