బీజేపీXటిడిపి, కేంద్రమంత్రులు లెక్కలు చెప్పాల్సిందే: బాబును మోడీ చిక్కుల్లోకి నెట్టేనా?
విజయవాడ: ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి, ఆత్మరక్షణలో పడిన భారతీయ జనతా పార్టీ.. తెలుగుదేశం పార్టీని చిక్కుల్లోకి నెట్టనుందా? అంటే బీజేపీ నేతల మాటలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. టిడిపి మిత్రధర్మాన్ని పాటించడం లేదని, తమను తప్పుపడితే అందుకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమని బీజేపీ చెబుతోంది.
ప్రత్యేక హోదా పైన తాము హామీ ఇచ్చిన మాట నిజమేనని, అయితే చట్టంలో చేర్చకుండా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని, దీంతో ఇప్పుడు చిక్కులు వచ్చి పడ్డాయని, అయితే, హోదా అనే మాట లేకుండా తాము ఏపీకి ఏం కావాలో అవన్నీ చేస్తున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు.
రాజ్యసభ షెడ్యూల్: జగన్కు షాకిచ్చేనా, బాబుకు 'తెలంగాణ' చిక్కు, కెసిఆర్ దయ ఎవరిపై?
హోదా విషయంలో టిడిపి నేతలు బీజేపీని ప్రశ్నించడాన్ని కమలం పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందుకు గట్టిగా సమాధానం ఇవ్వాలని భావిస్తున్నారు. తాము హోదా ఇవ్వనప్పటికీ అంతకంటే ఎక్కువ చేస్తున్నామని చెబుతున్న బీజేపీ.. వాటన్నింటిని వెల్లడించేందుకు సిద్ధమవుతోంది.
శుక్రవారం నాడు ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సిద్ధార్థనాధ్ సింగ్తో పార్టీ నేతలు సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను సిద్దార్థనాథ్ సింగ్ దృష్టికి తీసుకు వెళ్లారని తెలుస్తోంది.
తమను ప్రశ్నిస్తున్న టిడిపిని, చంద్రబాబును చిక్కుల్లో పడేసేందుకు వారు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో టిడిపి మనలను టార్గెట్ చేస్తోందని, దీనిని ఉపేక్షించవద్దని సిద్దార్థనాథ్ సింగ్కు ఏపీ నేతలు సూచించారు.
ఎంత సాయం చేశామో.. లెక్కలు చెప్పండి
ఏపీకి శాఖల వారీగా ఎంత సాయం అందిందో కేంద్రమంత్రులతో ప్రకటన చేయించాలని ఏపీ బీజేపీ నేతలు ఆయనకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను మన పైకి నెట్టే ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. టిడిపి మిత్రధర్మం పాటించలేదని ఫిర్యాదు చేశారు.
రాష్ట్రానికి ఈ రెండేళ్లలో ఎన్ని నిధులు ఇచ్చామో.. శాఖల వారీగా ప్రకటన చేయిస్తే, నేతల విమర్శలను వివరణలతో తిప్పికొట్టేందుకు సాధ్యమవుతుందని వారు సూచించారని తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు సహా పలు అంశాల్లో ప్రభుత్వం ప్రకటనలు అయోమయానికి గురి చేశాయని చెప్పారు.