వైఎస్ జగన్ సర్కార్కు మరో గిఫ్ట్: అనంతపురం-అమరావతి ఎక్స్ప్రెస్ వే కోసం నిధులు
న్యూఢిల్లీ/అమరావతి: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి మరో కానుకను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రాయలసీమలో అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లా నుంచి రాజధాని అమరావతికి అనుసంధానిస్తూ నిర్మించ తల పెట్టిన ఎక్స్ప్రెస్ రహదారి నిర్మాణానికి నిధులను కేటాయించింది. మొత్తం 23 వేల 300 కోట్ల రూపాయలను తొలిదశలో కేటాయించినట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.లక్షా 20 వేల కోట్లు
దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం, ఎక్స్ప్రెస్ రహదారుల నిర్మాణానికి తన శాఖకు లక్షా 20 వేల కోట్ల రూపాయలను కేటాయించాలని కోరుతూ కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. వచ్చేనెల 5వ తేదీన పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో..ఆయా రాష్ట్రాల నుంచి అందిన ప్రతిపాదనలు, వాటిని పూర్తి చేయడానికి కావాల్సిన నిధులను కేటాయించాలని నితిన్ గడ్కరీ కోరారు.
ఇందులో అనంతపురం-అమరావతి ఎక్స్ప్రెస్ వే నిర్మాణ ప్రతిపాదనలను కూడా పొందుపరిచారు. దీనికోసం సుమారు 30 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేయగా.. తొలి విడత కింద 23 వేల 300 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెబుతున్నారు. కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఈ నిధుల మొత్తాన్ని రాష్ట్రానికి మంజూరు చేయవచ్చని తెలుస్తోంది. ఇదివరకే రాష్ట్రానికి 542 కోట్ల రూపాయల మేర బడ్జెట్ను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా 23 వేల కోట్లతో ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి పూనుకోవడం పట్ల హర్షం వ్యక్తమౌతోంది.
అయిదు ఆప్షన్లలో ఏదో ఒకటి..
మొత్తం అయిదు మార్గాల్లో అనంతపురం నుంచి అమరావతికి ఎక్స్ప్రెస్ వేను నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో ఏదో ఒక మార్గానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపాల్సి ఉంటుంది. అనంతపురం సమీపంలోని మారూరు వద్ద మొదలయ్యే మొదటి మార్గం తాడిపత్రి, గిద్దలూరు, కంభం, ప్రత్తిపాడు, సత్తెనపల్లి మీదుగా విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డును అనుసంధానిస్తుంది. రెండో ఆప్షన్గా అనంతపురం, తాడిపత్రి, ఉయ్యాలవాడ, రుద్రవరం, గిద్దలూరు, బెస్తవారి పేటగా నిర్ధారించారు.
చిత్తూరు మినహాయించి..
మూడో మార్గంగా అనంతపురం సమీపంలోని మామిళ్లపల్లి నుంచి ఆరంభం అయ్యే ఎక్స్ప్రెస్ వే.. రైల్వే కొండాపురం, ముద్దనూరు, యర్రగుంట్ల, కమలాపురం, మైదుకూరు, వనిపెంట, కనిగిరి, దర్శి, కావూరు, ఫిరంగిపురం మీదుగా శాఖమూరు వద్ద ముగుస్తుంది. అయిదో ఆప్షన్గా అనంతపురం, నార్పల, యర్రగుంట్ల, వనిపెంట, పోరుమామిళ్ల, తాటిచెర్ల, బెస్తవారి పేట, దర్శి, కొమ్మాలపాడు, కావూరు, ఫిరంగిపురం, సిరిపురంగా నిర్ణయించారు. ఈ అయిదింట్లో ఓ మార్గాన్ని ఎంపిక చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన కసరత్తు దాదాపు తుది దశకు చేరినట్లు చెబుతున్నారు. ఈ అయిదు ఆప్షన్లలో చిత్తూరు మినహాయించి, రాయలసీమలో మిగిలిన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల మీదుగా ఈ ఎక్స్ప్రెస్ వేను నిర్మిస్తారు.
అనంతపురం-అమరావతి 544 ఎఫ్ గా గుర్తింపు..
అనంతపురంలో ఆరంభం అయ్యే ఈ ఎక్స్ప్రెస్ వే కర్నూలు, కడప జిల్లాల గుండా సాగుతుంది. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రె్సవే'గా దీన్ని నిర్మిస్తారు. ఈ మార్గానికి జాతీయ రహదారిగా హోదా ఇచ్చింది కేంద్రం. 544 ఎఫ్గా నిర్ధారించింది. జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ దీని నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తుంది. ఈ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 30 శాతం ఖర్చును భరించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. 30 శాతం నిధుల వాటాను భరించడానికి అంగీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడం వల్ల ఈ రోడ్డు నిర్మాణ పనుల కోసం 23 వేల 300 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించినట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఈ నిధులను మంజూరు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.