పవన్ కళ్యాణ్పైకి రాయి: వంగవీటి రంగా వచ్చినట్లుంది, బాబుపై రైతు నిప్పులు
పెనుమాక: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెనుమాక గ్రామంలో రైతులను కలిశారు. రాజధానికి భూమి ఇచ్చేందుకు ఎందుకు విముఖత చూపుతున్నారో రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మీరే ఆదుకోవాలని పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు.
రైతులతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా అగంతకుడు ఒకరు ఆయన పైకి రాయిని విసిరారు. దీంతో, అభిమానులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పలువురు రైతులు ఇలా చెప్పారు...
రైతులు ఏం మాట్లాడారు?
రైతులు: మా పంట భూములు తీసుకుంటే ఎలా. మీరే న్యాయం చేయాలి. మూడు పంటల బీడు భూములను తీసుకుంటే ఎలా అన్నారు. మా భూములు ఇచ్చేందుకు మేం సిద్ధం లేమన్నారు. నేను రూ.30 కోట్లు సంపాదిస్తానని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో తాము బతకలేమన్నారు.
రైతులు: మా బాధ ఏమంటే మాకు 60 సెంట్ల భూమి ఉంది. మాకు ఆస్తులు లేవు. ఆ భూమిని తీసుకుంటే మేం ఎలా బతకాలి. మాకు ఎర్రబాలెం గ్రామంలో భూమి ఉంది. భూసేకరణ చేస్తే మాకు ఆత్మహత్య తప్ప మరో దిక్కులేదు. మీరే దిక్కు. ఇక ఎవరు లేరు. మా బాధ అర్థం చేసుకోండి.
పవన్ కళ్యాణ్: ల్యాండ్ పూలింగ్కు మీకున్న సమస్య ఏమిటి?
రైతులు: చట్టంలో లోపాలున్నాయి. అనివార్య కారణాల వల్ల భూమి ఇచ్చిన వారికి ఇవ్వాల్సింది ఇవ్వకుంటే కోర్టుకు వెళ్లినా చెల్లదని ఉందని చెప్పారని తెలుస్తోంది. భూసేకరణ చట్టంలో లోపాలున్నాయన్నారు.
రైతులు: నాకు ఇరవై సెంట్ల భూమి ఉంది. రోజుకు రూ.5వేలు సంపాదించుకుంటున్నా. కానీ దానిని తీసుకొని సంవత్సరానికి రూ.30 ఇస్తామని సీఆర్డీఏ చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసేది ఎవరంటే పవన్ కళ్యాణే గుర్తుకు వచ్చారన్నారు. తమది బీడుభూములు అని ప్రచారం చేస్తున్నారన్నారు.
రైతులు: రాజధాని వచ్చాక తమ భూముల ధరలు పెరుగుతాయనే తాము భూములు ఇవ్వడం లేదని చంద్రబాబు చెబుతున్నారని, తాము దొంగలం అంటున్నారని చెప్పారు. కానీ అది తప్పన్నారు.
రైతులు: మాకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. మాకు లారీల కొద్ది కూరగాయల పంటలు పండుతాయి. మీరు వచ్చి చంద్రబాబుకు - బిజెపికి ఓటేయమని చెప్పారు కాబట్టి మేం వేశాం. అలాంటి భూమిని తీసుకుంటే ఎలా. మా భూమి తీసుకుంటే మేం ఆత్మహత్య చేసుకోవాలి.
అరుపులు
పవన్ కళ్యాణ్కు రైతులు సమస్యలు చెబుతుండగా.. పలువురు అరిచారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మేం జనసేన అధినేతకు చెప్పింది అబద్దమైతే అరవవచ్చునని చెప్పారు. పవన్ కళ్యాణ్ ధైర్యంగానే ఉన్నారని చెప్పారు.
మా భూములు బలవంతంగా తీసుకుంటామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేం స్వచ్చంధంగా భూములు ఇవ్వలేదన్నారు. బ్రిటిష్ పాలన లాగా విభజించి - పాలిస్తున్నారన్నారు. 30వేల ఎకరాలు దొరికిందని చెబుతున్నారని, అలాంటప్పుడు మా భూములు ఎందుకని ప్రశ్నించారు. మేం ఎప్పుడు టిడిపికి ఓటేయలేదని, మీరు చెప్తే ఓటేశామన్నారు.
వంగవీటి రంగా వచ్చినట్లుంది
ఓ మహిళా రైతు మాట్లాడుతూ... తనకు 30 ఎకరాల భూమి ఉందని, ఇటీవలే హాస్పిటల్ ఖర్చుల కోసం రెండెకరాల భూమిని అమ్మేశామని చెప్పారు. ఎంతో కష్టపడి కొనుక్కున్న భూమి అని, ఇది తీసేసుకుంటే తామెలా బతకాలని, మరణం తప్ప మరే దారి లేదన్నారు. తమరు రావడం చూస్తుంటే వంగవీటి రంగా వచ్చినట్టుందన్నారు. దీంతో, అక్కడున్న జనాల్లో పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వెల్లువెత్తాయి.
ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం: జనసేన
పవన్ కళ్యాణ్ రాజధానికి భూమి ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్రామాలలో పర్యటిస్తారని జనసేన ఉండవల్లి నాయకులు చెబుతున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారని చెప్పారు. అవసరమైతే పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమని చెప్పారు.