ఏపీలో అమల్లోకి వచ్చిన అన్ లాక్ 3.0 - తెరుచుకున్న జిమ్లు, యోగా కేంద్రాలు..
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నెల 31 వరకూ ఇవి కొనసాగనున్నాయి. దీంతో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో అన్ లాక్ ప్రక్రియ మొదలయినట్లైంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆగస్టు 31 వరకు విద్యాసంస్థల ప్రారంభానికి అనుమతులు లేవు.అలాగే సినిమా హాలు, స్విమ్మింగ్ పూల్స్, బార్ లు తెరుచుకోడానికి కూడా అవకాశం లేదు. తగిన జాగ్రత్తలతో యోగ ట్రైనింగ్ సెంటర్ లు, జిమ్ లకు నేటి నుండి అనుమతి ఇచ్చారు.
ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కంటోన్మెంట్ జోనుల్లో ఈ నెలలో 31 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో ఇంకా కరోనా కేసులు భారీగా నమోదవుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా ఆగడం లేదు. అయినా కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ లాక్ ప్రక్రియ అమలు చేయక తప్పని పరిస్ధితి. దీంతో ప్రభుత్వం కూడా కేంద్రం మార్గదర్శకాల ప్రకారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 31న కేంద్రం అన్ లాక్ 4.0 ప్రకటించనుంది. అప్పటి వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి.