ఏపీలో అన్లాక్ 5.0 గైడ్ లైన్స్ విడుదల... ఈ నిబంధనలు పాటించాల్సిందే...
ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్లాక్ 5.0 మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో లాగే రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు,భౌతిక దూరం తప్పనిసరి అని పేర్కొంది. మాస్క్ ధరించకుండా వచ్చేవారిని మాల్స్,సినిమా హాల్స్లోకి అనుమతించవద్దని ఆదేశించింది. అలాగే అన్ని సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రజా రవాణా,ప్రార్థనా మందిరాల్లోనూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరి అని తెలిపింది.
కోవిడ్ 19 నిబంధనలు సరిగా అమలవుతున్నాయో లేదో పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్లు,రైల్వే స్టేషన్లలో మైక్ సెట్స్ ద్వారా కోవిడ్ 19 జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించింది. అలాగే సినిమా హాళ్లలో సినిమా ప్రదర్శనకు ముందు కోవిడ్ 19 జాగ్రత్తలకు సంబంధించి టెలీ ఫిలిం ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
స్కూళ్లు,విద్యా సంస్థలు,పారిశ్రామిక కార్యకలాపాలు జరిగేచోట కేంద్ర మార్గదర్శకాలను తప్పక పాటించాలని ఆదేశించింది. విద్యార్థులు,టీచర్లు ప్రతీ పీరియడ్ తర్వాత చేతులను శానిటైజ్ చేసుకునేలా యాజమాన్యాలకు ఆదేశాలివ్వాలని అధికారులకు సూచించింది.
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30న అన్లాక్ 5 మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజా మార్గదర్శకాల్లో అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం సీట్లతో థియేటర్లు,మల్టిప్లెక్సుల నిర్వహణకు అనుమతినిచ్చింది. అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు,విద్యా సంస్థల రీఓపెన్కు అనుమతినిచ్చిన కేంద్రం... దీనిపై తుది నిర్ణయాన్ని మాత్రం రాష్ట్రాలకే వదిలిపెట్టింది. స్విమ్మింగ్ పూల్స్లో కేవలం క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు మాత్రమే అనుమతిచ్చింది. బిజినెస్ టూ బిజినెస్ ఎగ్జిబిషన్స్ కోసం సంబంధిత శాఖల అనుమతి పొందాలని తెలిపింది. ఇక అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 31 వరకు పొడగించింది.
Recommended Video