ఆరోగ్యమంత్రి ఆళ్లనాని నియోజకవర్గంలో అనధికారిక కరోనా ఆస్పత్రి- లక్షల్లో ఫీజులు- చివరికి సీజ్
ఏలూరు : ఆయన రాష్ట్రానికి ఆరోగ్య మంత్రి. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి రాష్ట్రమంతా పర్యటించి వైరస్ నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కీలక సమయంలో ప్రభుత్వానికి నోట్లో నాలుకలా మారిపోయారు. కరోనా పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రులకు రోజూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా విజయవాడ రమేష్ ఆస్పత్రి అగ్నిప్రమాదం విషయంలోనూ తప్పున్నట్లు తేలితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. కానీ ఆయన సొంత నియోజకవర్గం ఏలూరులో మాత్రం ఏం జరుగుతుందో చూసుకునే తీరిక మాత్రం ఆయనకు లేనట్లే కనిపిస్తోంది.
వ్యాక్సిన్ సామర్థ్యంపై కరోనా ఉత్పరివర్తనాలు ప్రభావం చూపుతాయా..?
ఫేస్ కరోనా ఆస్పత్రి సీజ్...
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నరసింహారావుపేటలో ఉన్న మురళీ కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కొన్నేళ్లుగా వివిధ రోగాలకు చికిత్స అందిస్తోంది. తాజాగా కరోనా వైరస్ ప్రభావం మొదలయ్యాక ప్రభుత్వ ఆస్పత్రులు సరిపోవక పోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు కూడా అనుమతులు ఇస్తున్నారు. ఇలా అనుమతి కావాలంటే సవాలక్ష నిబంధనలు ఉంటాయి. వీటన్నింటినీ సంతృప్తి పరచాల్సిందే. లేకపోతే అనుమతులు రావు. కానీ ఇవన్నీ ఎందుకు అనుమతుల్లేకుండానే కరోనా వైద్యం మొదలుపెడితే ఈ హడావిడిలో ఎవరు చూస్తారులే అనుకున్నట్లున్నారు. కరోనా పేరుతో వైద్యం మొదలుపెట్టేశారు.
దోపిడీ సాగుతోందిలా...
కరోనా పేరుతో అనధికారికంగా వైద్యం చేస్తూ మురళీ కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి దోపిడీ పర్వానికి తెరలేపింది. కరోనా సోకిన వ్యక్తికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకూ ఈ ఆస్పత్రిలో వసూళ్లు చేసినట్లు అదికారులు గుర్తించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో తనిఖీలు నిర్వహించిన వైద్యారోగ్యశాఖ అధికారులకు కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు తెలిసొచ్చాయి. బాధితుడికి పీపీఈ కిట్ పేరుతో రోజుకు రూ.10వేలు వసూలు చేస్తున్నట్లు తేలింది. ఆసుపత్రిపై డీఎంహెచ్వో, ఏలూరు రెవెన్యూ యంత్రాంగం నిర్వహించిన దాడుల్లో సుమారు 10 లక్షల విలువైన రెమ్డెసివిర్ ఇంజక్షన్లను కూడా సీజ్ చేశారు.
కోవిడ్ ఆస్పత్రులకు బాధితులు..
మురళీ కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిపై వైద్యారోగ్యశాఖ అధికారులు ఇవాళ దాడి చేసిన సమయంలోనూ 18 మంది కరోనా బాధితులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆస్పత్రిని సీజ్ చేసి రోగులను అక్కడి నుంచి కోవిడ్ ఆస్పత్రులకు తరలించారు. రోగుల బంధువులను విచారించగా.. వైద్యం పేరుతో జరుగుతున్న అక్రమాలు బయటపడ్డాయి. కరోనా ఆస్పత్రి నిర్వహణకు ఎలాంటి అనుమతి లేకపోయినా వైద్యం నిర్వహించడమే కాకుండా కనీస సదుపాయాలు కూడా ఉంచలేదని నిర్ధారణ అయింది. ఇలాంటి పరిస్ధితుల్లోనే విజయవాడ రమేష్ ఆస్పత్రి నిర్వహించిన కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఈ అనధికారిక ఆస్పత్రి విషయంలో అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.
ఆరోగ్యమంత్రి సొంత నియోజకవర్గంలో...
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో ఇంత జరుగుతున్నా ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరోగ్య మంత్రి ఆళ్లనానికి మాత్రం కనీస సమాచారం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రుల ఆరాచకాలపై నిత్యం హెచ్చరికలు చేస్తున్న ఆరోగ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఈ తంతును ఎందుకు గమనించలేకపోయారన్న దానిపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు నిరంతరం తనిఖీలు చేపడితే ఇలాంటి అనధికార వ్యవహారాలు జరిగే అవకాశం లేదు. కానీ అధికారుల అలసత్వం కారణంగానే ఇలాంటి ఆస్పత్రులు నిర్వహిస్తూ రోగుల నుంచి లక్షలు దోచు కుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆస్పత్రుల తనిఖీలు సక్రమంగా నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.