యురేనియంపై కదం తొక్కుతున్న వామపక్షాలు: టీడీపీ, జనసేనతో కలిసి జట్టుగా!
కర్నూలు: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో నిక్షిప్తమై ఉన్న అత్యంత ప్రమాదకర యురేనియాన్ని వెలికి తీయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల వామపక్ష నాయకులు కదం తొక్కుతున్నారు. యురేనియం తవ్వకాలను నిలిపి వేయాలంటూ గళమెత్తారు. యురేనియం నిక్షేపాలను గుర్తించడానికి జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో డ్రిల్లింగ్ చేపట్టడంపై ఉద్యమిస్తున్నారు. దీనికోసం అఖిల పక్షాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, జనసేన పార్టీ, తొమ్మిది వామపక్షాలు జట్టు కట్టాయి.
ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలోని యాదవాడ గ్రామంలో కేంద్ర అణువిద్యుత్ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే డ్రిల్లింగ్ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే కళాజాతాలతో నిరసన తెలిపిన వామపక్ష పార్టీల నాయకులు ఈ సారి క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టారు. డ్రిల్లింగ్ కొనసాగిస్తోన్న యాదవాడ, కడప జిల్లాలో తుమ్మలపల్లి సహా ప్రతిపాదిత ప్రాంతాలను సందర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని వేముల మండలం పరిధిలో యురేనియం బాధిత గ్రామాలను సందర్శించారు. గ్రామీణులతో ముఖాముఖి సమావేశాలను నిర్వహించారు.
తెలుగుదేశం తరఫున మాజీ మంత్రులు కాలువ శ్రీనివాసులు, భూమా అఖిలప్రియ, కేఈ ప్రభాకర్, భూమా బ్రహ్మానందరెడ్డి, గౌరు చరిత, కోట్ల సుజాతమ్మ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, సీపీఎం నుంచి కే ప్రభాకర్ పాటు తొమ్మిది వామపక్ష పార్టీల ప్రతినిధులు ఈ అఖిలపక్ష బృందంలో ఉన్నారు. యాదవాడలో చేపట్టిన యురేనియం రిల్లింగ్ పనులను గ్రామస్తలు స్వచ్ఛందంగా అడ్డుకున్నారని, అలాంటి చైతన్యం ప్రజల్లో రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
తెలంగాణలో తాము చేపట్టిన పోరాటాలకు కేసీఆర్ ప్రభుత్వం దిగి వచ్చిందని యురేనియం తవ్వకాలను అనుమతించబోమంటూ అసెంబ్లీలో తీర్మానించిందని, వైఎస్ జగన్ కూడా దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. తన సొంత నియోజకవర్గం ప్రాణాంతక యురేనియం బారిన పడితే ఆయన చూస్తూ ఉన్నారని ఆరోపించారు. యురేనియం ప్రభావం వల్ల పంటలు నాశనమౌతాయని అన్నారు. ప్రపంచంలో 85 శాతం దేశాలన్నీ యురేనియం ఉత్పత్తిని నిలిపివేశాయని, కేంద్ర ప్రభుత్వం దీని వెంట ఎందుకు పడుతోందని అన్నారు. మరో అంబానీల వంటి బడా పారిశ్రామికవేత్తల కోసమే యురేనియాన్ని వెలికి తీయాలని కేంద్రం భావిస్తోందని విమర్శించారు.