పట్టణ ప్రాంత ఓటర్లు వైసీపికి సారీ..! గ్రామీణ ఓటర్ల పైనే జగన్ గురి..!!
హైదరాబాద్ : అన్నీ అనూకూలంగా ఉన్నాయనుకుంటున్న తరుణంలో, వివిధ సర్వేలు కూడా అనుకూలంగా నివేదికలు వెళ్లడిస్తున్న నేపథ్యంలో ధీమాగా వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాల్సింది పోయి ప్రతిపక్ష నేత వెనకుడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా వచ్చే సాధారణ ఎన్నికలు వైసీపీ ని ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. జయాపజయాల్లో కీలకమైన ఓట్ల తేడానే దీనికి కారణంగా ఆ పర్టీ విశ్లేషిస్తోంది. టీడీపీ ని ఎదుర్కొని నిలబడగల పార్టీగా వైసీపీనే జనం ఆదరించారు. ఏపీలో ఈ మేరకు నాలుగేళ్లలో వైసీపి బలోపేతం అయ్యింది. కానీ అక్రమాస్తుల కేసులు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. గ్రామీణప్రాంత ఓటర్లు, వైఎస్ రాజశేఖర్రెడ్డి వారసుడిగా జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. ఇకపోతే పట్టణ, నగరాల ఓటర్లు మాత్రం జగన్ గెలిస్తే మరోసారి అవినీతి పెరుగుతుందనే ఆందోళనలో ఉన్నారు. ఇటీవల ఓ సంస్థ చేపట్టిన సర్వేలోనూ ఇదే విషయం బయటకురావటం వైసీపి ముఖ్య నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ వ్యతిరేక ఓట్లు తమకే అనుకున్నప్పటికీ.. జనసేన ప్రభావం తో అవన్నీ గ్లాసు వైపు మళ్లే అవకాశాలను కొట్టేయలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
175 నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా కేవలం 2.06 శాతం మాత్రమే. కొన్నిచోట్ల కేవలం 500-1000 స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. ఓడిన నేతలంతా పట్టణ, నగర ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లోనే కావటం విశేషం. ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికి అదే పరిస్థితి. అటువంటి వ్యతిరేకత వాతావరణం ఉండటం కూడా వైసీపీను గుబులు పుట్టిస్తోంది. ప్రభుత్వ పథకాలు ఈ సారి పట్టణ ఓటర్లను మరింత ప్రభావితం చేస్తాయని టీడీపీ గట్టిగా భావిస్తోంది. మరి ఈ పరిస్తితిని అధిగమించి, పట్టణ ఓటర్ల మనసు గెలుచుకోవటం జగన్కు పెనుసవాల్గా మారిందనేది పార్టీ సీనియర్లూ అంగీకరిస్తున్న విషయం. పైగా, ప్రజాశాంతిపార్టీ పేరుతో కేఏపాల్ కూడా క్రైస్తవుల ఓట్లను చీల్చే అవకాశాలున్నాయి. మరి.. ముప్పేట దాడిని తట్టుకుని, అధికార వైపు ఎలా అడుగులు వేయాలి అనేది మాత్రం వైసీపీ అధినేతను అయోమయానికి గురి చేస్తున్న అంశమే..!!