విశాఖలో హబ్ ఏర్పాటుకు అమెరికా కాన్సులేట్ సుముఖత: జగన్ సర్కారుపై ప్రశంసలు
అమరావతి: అమెరికా కాన్సుల్ జనరల్(హైదరాబాద్) జోయల్ రీఫ్మెన్తో పాటు కాన్సులేట్ అధికారులు డేవిడ్ మోయర్, సీన్ రూథ్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను కలిశారు. తాము విశాఖలో పర్యటించామని, అక్కడి వసతులు, సౌకర్యాలు తమకు ఎంతో సంతృప్తి ఇచ్చాయని ఈ సందర్భంగా జోయల్ రీఫ్మెన్ తెలిపారు.
విశాఖలో దేశంలోనే రెండో హబ్ ఏర్పాటుకు అమెరికా సుముఖత
ఈ నేపథ్యంలో విశాఖలో హబ్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని ఆయన వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకు ఒక్క అహ్మదాబాద్లో మాత్రమే అలాంటి హబ్ ఉందని చెప్పారు. కాగా, ఢిల్లీలో ఉన్నట్లుగా విశాఖలోనూ అమెరికా ఇంక్యుబేటర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎం జగన్ చేసిన విజ్ఞప్తికి అమెరికా కాన్సుల్ జనరల్ సానుకూలంగా స్పందించారు. విశాఖలో ఇంక్యుబేటర్ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
అమెరికా సహకారం కోరిన జగన్..
అమెరికా -ఆంధ్ర మధ్య పరస్పర సహకారం మరింత పెంపొందేలా కాన్సుల్ జనరల్ చొరవ చూపాలని, ఆ దిశలో తాము కూడా కలిసి నడుస్తామని భేటీ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆంగ్ల భాష ప్రాధాన్యం గుర్తించామని, అందువల్లనే అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియమ్ అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ప్రాంతీయ ఆంగ్ల భాషా కార్యాలయం (రెలో)ను గుర్తు చేసిన సీఎం జగన్, ఆ కార్యాలయం కార్యకలాపాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో 98 శాతం స్కూళ్లు ఆంగ్లంలో బోధిస్తున్నాయన్న సీఎం.. టీచర్లకు ఆంగ్ల భాషలో శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తమతో రెలో కలిసి రావాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. విశాఖలో హబ్ ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం జగన్, దానిపై హర్షం వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీగా విశాఖ ఎదగడంలో అమెరికా సహకరించాలని కోరారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో తెలుగువారు రాణిస్తున్నారన్న జగన్.. ఆ దేశ అభివృద్ధిలో తెలుగువారు కీలక పాత్ర పోషిస్తుండం సంతోషదాయకమన్నారు.
ఏపీ పెట్టుబడులకు అనుకూలం
పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలమైన రాష్ట్రమన్నారు ముఖ్యమంత్రి. విశాలమైన సముద్ర తీర ప్రాంతం అందుకు ఎంతో దోహదకారిగా నిలుస్తోందని చెప్పారు. ఇంకా నౌకాశ్రయాల నిర్మాణంతో ఆర్ధికాభివృద్ధి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. అందువల్ల రాష్ట్రంలో పెట్టుబడులకు కాన్సుల్ జనరల్ చొరవ చూపాలన్న సీఎం.. ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని వెల్లడించారు. మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రగతికి అమెరికా సహకరించాలని సీఎం కోరారు.
జగన్ సర్కారు పథకాలపై అమెరికా కాన్సులేట్ ప్రశంసలు
కాగా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు, పథకాలు విప్లవాత్మక చర్యలని అమెరికా కాన్పుల్ జనరల్ జోయల్ రీఫ్మెన్ కొనియాడారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గ్రామ స్థాయికి పరిపాలనను తీసుకుపోవడం, వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాల డోర్ డెలివరీ అత్యుత్తమ విధానాలు అని ఆయన ప్రశంసించారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా, దళారి వ్యవస్థకు చోటునివ్వకుండా, అన్ని పథకాల ప్రయోజనాలను ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోందని, ఇంకా సామాజిక తనిఖీ వంటి వాటి ద్వారా పారదర్శక ప్రక్రియ కొనసాగుతోందని మెచ్చుకున్నారు. కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును, కోవిడ్ మేనేజ్మెంట్ను అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్మెన్ ప్రశంసించారు.