టెక్కీ కూచిభొట్ల హత్య: నేరం అంగీకరించిన నిందితుడు, సునయన స్పందన
వాషింగ్టన్: అమెరికాలో దారుణంగా హత్యకు గురైన ఇండియన్ టెకీ కూచిభొట్ల శ్రీనివాస్ హత్య కేసులో నిందితుడుు కోర్టు ఎదుట నేరాన్ని అంగీకరించాడు.
గతేడాది డిసెంబర్లో ఈ కేసుపై తొలిసారిగా కోర్టులో వాదనలు జరిగా.. తాజాగా మరోసారి కోర్టు దీనిపై విచారణ చేపట్టింది. తాజా విచారణలో నిందితుడు ఆడం పురింటన్ నేరం అంగీకరించాడు.
మే 4న శిక్ష..:
నిందితుడు నేరం అంగీకరించడంతో అతనికి 50ఏళ్ల యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాత్యహంకార హత్య కావడంతో.. కేసులో అతనికి పెరోల్ కూడా ఇవ్వవద్దని కోర్టు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆస్టిన్స్ బార్లో కాల్పులు..:
స్టూడెంట్ వీసా మీద అమెరికాకు వెళ్లిన శ్రీనివాస్, అలోక్.. అక్కడి జీపీఎస్ తయారీ కంపెనీ గార్మిన్లో ఇంజినీర్లుగా పనిచేసేవారు.
గత ఏడాది ఫిబ్రవరి 27న విధులు ముగించుకొని స్నేహితులిద్దరు కాన్సస్లోని ఆస్టిన్స్ బార్ అండ్ గ్రిల్లోకి మద్యం సేవించేందుకు వెళ్లారు. అక్కడే నిందితుడు వీరిపై కాల్పులకు తెగబడ్డాడు.
జాత్యహంకార హత్య..:
మొదట జాత్యహంకార దూషణతో కూచిభొట్ల శ్రీనివాస్, అలోక్ లపై నిందితుడు పూరింటన్ విరుచుకుపడ్డాడు. 'మా దేశం విడిచి వెళ్లిపోండి' అంటూ గట్టిగా అరిచాడు. దీంతో బార్ సిబ్బంది అతన్ని బయటకు వెళ్లిపోవాల్సిందిగా వారించారు. బయటకు వెళ్లిన పూరింటన్.. తిరిగి తుపాకీతో వచ్చి శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్పై కాల్పులు జరిపాడు.
వాళ్లిద్దరితో గాయాలతో బయటపడ్డారు:
పూరింటన్ కాల్పులు జరుపుతున్న సందర్భంలో స్థానిక శ్వేతజాతీయుడు ఇయాన్ గ్రిలాట్ అతనికి అడ్డుపడే ప్రయత్నం చేయగా.. అతనిపై కూడా కాల్పులు జరిపాడు. ఘటనలో శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలు విడువగా అలోక్, ఇయాన్ గాయాలపాలయ్యారు.
కూచిభొట్ల శ్రీనివాస్ భార్య స్పందన:
ఈ నేపథ్యంలో శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన దుమల స్పందించారు. నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో.. విద్వేషం ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదనే బలమైన సందేశాన్ని అందించాలని, మనమంతా పరస్పరం ప్రేమించుకోవాలని ఆమె పేర్కొన్నారు.