చంద్రబాబు ఆపదమొక్కులు: ఎన్నికల హామీలపై ఇలా ఫోకస్
అవసరాన్ని బట్టి వ్యూహం రూపొందించడం.. పనై పోయిన తర్వాత ఆ వ్యూహాన్ని వదిలేసి భిన్నమైన పంథా అనుసరించడం ఏపీ సీఎం - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కొత్తేం కాదు.
హైదరాబాద్/ అమరావతి: అవసరాన్ని బట్టి వ్యూహం రూపొందించడం.. పనై పోయిన తర్వాత ఆ వ్యూహాన్ని వదిలేసి భిన్నమైన పంథా అనుసరించడం ఏపీ సీఎం - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కొత్తేం కాదు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ - లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్న టీడీపీ మాత్రమే లాభ పడిందే తప్ప.. మిగతా మూడు పార్టీలకు ఒనగూడిన ప్రయోజనమేమీ లేదు. ఫలితంగా తెలంగాణలో తమకు గట్టి పట్టు ఉన్నదని ఇప్పటికీ చంద్రబాబు చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు.
2009లో జరిగిన పరిణామాలు.. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికల్లో తెలంగాణలో దళితులు.. ప్రత్యేకించి మాదిగల మద్దతు పొందేందుకు ఎమ్మార్పీఎస్ సహకారంతో ప్రచారం నిర్వహించుకున్న చంద్రబాబు నాయుడు.. తాను పెద్ద మాదిగలా పని చేస్తానన్నారు. ఏపీలో 'నౌ ఆర్ నెవ్వర్' అన్న పరిస్థితి చంద్రబాబుది.
ఈ క్రమంలో తన అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలన్నీ అమాయక ప్రజలపైకి వదిలారు. అప్పటి వరకు తాను 'మారిన మనిషిని' అని పదేపదే బహిరంగ వ్యాఖ్యలు.. అనుకూల మీడియాలో వార్తలతో వారిలో చొప్పించడానికి విశ్వ ప్రయత్నం చేశారు.
మద్య నిషేధం అమలు సాధ్యమేనా
అందునా ఎన్నికల సంగ్రామంలో కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. ఆనక గెలుపొందాక కాపు సామాజిక వర్గానికి, బీసీల్లో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టేయడంతోనే సరి అనిపించుకునేందుకు ప్రయత్నించారు చంద్రబాబు. ఈ క్రమంలోనిదే మద్య నిషేధం హామీ కూడా. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో బెల్ట్ షాపులను ఎత్తివేస్తానని తెలుగుదేశం హామీ ఇచ్చింది. కానీ మూడేళ్లవుతున్నా.. దాని అమలు ఊసే లేదు. అసలే రెవెన్యూ లోటు.. ఆ పై బెల్ట్ షాపులు మూసేస్తే భర్తీ చేసుకోవడం ఎలా? అన్నదీ ఏపీ సీఎంలో ఉన్న భయం మరి.
Recommended Video
మహిళల మదిని గెలుచుకునేందుకు బాబు యత్నాలు
కానీ ఇటీవల ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన నవరత్న పథకాల హామీతో చంద్రబాబు సర్కార్లో వణుకు ప్రారంభమైంది. ఈ పథకాలకు ప్రజల నుంచి ఆదరణ వస్తుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. మొన్నటికి మొన్న డ్వాక్రా సంఘాలకు రూ.676 కోట్లు విడుదల చేస్తే, తాజాగా క్యాబినెట్ సాక్షిగా బెల్ట్ షాపులను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎక్సైజ్ విధానంపై మహిళల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతోపాటు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దశలవారీ మద్యపాన నిషేధాన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు ఇలా సర్కార్ రెడీ
ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులను తక్షణం తొలగించాలని నిర్ణయించింది. ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో నూతన ఎక్సైజ్ పాలసీపై మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇందులో భాగంగా బెల్ట్షాపులను తక్షణం తొలగించాలని సీఎం బాబు ఆదేశించినట్లు రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. లైసెన్స్ లేకుండా అమ్మకాలు జరుపుతున్న వారిపై, వీరికి మద్యం సరఫరా చేస్తున్న షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారన్నారు. ఇందుకోసం పోలీసు, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాయని తెలిపారు. ఇదే విధంగా రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అక్రమ వాడకంపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.
సీమ ఫ్యాక్షనిస్టులపై ఇలా అభాండాలు
2014 ఎన్నికల్లో కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీలు గుప్పించారు. ఆ హామీ ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు కుమ్మరించింది. చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత క్రమంగా కాపులకు బీసీ రిజర్వేషన్ల అంశమే మరిచిపోయారు. కానీ మాజీ మంత్రి - సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం రూపంలో కాపుల ఆగ్రహం, నిరసన జ్వాల రోడ్డెక్కింది. తొలిదశలోనే ఆందోళన హింసాత్మకంగా మారింది. అదంతా రాయలసీమ ఫ్యాక్షనిస్టుల పనని పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించింది అధికార తెలుగుదేశం పార్టీ. తర్వాత ఆచరణలో ఈ హింసాకాండలో ఉన్నవారంటూ పలువురిపై కేసులు నమోదు చేసింది.
తొందరగా నివేదిక ఇవ్వాలని మంజునాథ కమిషన్ ను కోరిన ఏపీ
మరో దఫా పాదయాత్ర చేయడానికి అనుమతి నిరాకరించి ముద్రగడను గ్రుహ నిర్బంధానికి గురిచేసిన గొప్ప గుణం చంద్రబాబు సర్కార్ది. నిరసన స్వరంగా క్రమంగా పెరుగుతుండటంతో గత ఏడాది ఫిబ్రవరి రెండో తేదీన మంజునాథ కమిషన్ ఏర్పాటు చేశారు చంద్రబాబు. కానీ ఎనిమిది నెలల్లోనే నివేదిక ఇవ్వాలని కోరినా ఇప్పటికీ ఇవ్వలేదని తాజా ప్రభుత్వ ఆక్షేపణ. కమిషన్ కావాలని సమయం తీసుకున్నదన్న వాతావరణం సామాన్యుల్లో కలిగించాలన్న వ్యూహం అందులో దాగి ఉన్నది. అందుకే సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని మంజునాథ కమిషన్ ను కోరింది ఏపీ క్యాబినెట్. దీని ముందు మరో సమస్య ఉందండి. ముద్రగడ మరోసారి పాదయాత్ర చేస్తాననే సరికి మంజునాథ కమిషన్.. కాపులకు బీసీ రిజర్వేషన్ల అంశం ముందుకు వచ్చాయండి. అదీ సంగతి.
ఏపీలో మాలలదే ఇలా ఆధిపత్యం
ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీల్లో విభేదాలను ప్రోత్సహిస్తూ మాల, మాదిగల మధ్య రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమాన్ని ప్రోత్సహించారని టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు ఉన్నాయి. అందుకు తగినట్లే 2014 వరకు తెలంగాణలో ఎమ్మార్పీఎస్ మద్దతుతోనే కార్యకలాపాలు సాగించారు. కానీ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఏపీలో మాదిగల జనాభా తక్కువ. ఎన్ని కారణాలు చెప్పినా మాలలదే ఆధిపత్యం. కనుక సహజంగానే చంద్రబాబు వైఖరి మారిపోయింది. పొరుగున ఉన్న తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు రెండుసార్లు ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి నివేదించారు. అఖిలపక్షంతో కేంద్రాన్ని కలిసేందుకూ సిద్ధమయ్యారు. కానీ అనివార్య కారణాల రీత్యా చివరి క్షణంలో ప్రధానితో భేటీ రద్దు కావడంతో అఖిలపక్ష హస్తిన పర్యటనను ఆయన విరమించుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దళితులతో ప్రస్తుతానికి అవసరం లేదని భావించినందునేనని విమర్శలు వినిపిస్తున్నాయి.