ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే క్రికెట్ మ్యాచ్: జెఏసి
విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని, లేదంటే.. విశాఖ నగరంలో జరగబోయే ఇండియా-వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్ను అడ్డుకుంటామని ఉత్తరాంధ్ర పొలిటికల్ జెఏసి ఛైర్మన్ జెటి రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం ఉదయం స్థానిక జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జెఏసి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్, స్టీల్ ప్లాంటుకు సొంత గనులు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్, ఐఐటి, హైకోర్టు లాంటి అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నాయని చెప్పారు.
ప్రతి సంవత్సరం రూ. 35వేల కోట్లు పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నా ఉత్తరాంధ్రకు మాత్రం కన్నీళ్లే మిగిలాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే విమానాశ్రయం, క్రికెటర్లు బస చేసే హోటళ్ల వద్ద, మైదానంలోనూ ఆందోళన నిర్వహిస్తామని రామారావు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కె రామచంద్రమూర్తి, కోటేశ్వరరావు, రాంప్రసాద్, శ్రీరామమూర్తి, అవినాష్, శకుంతల, గీత పాల్గొన్నారు.