బాబు మోసం చేయలేదు, దీక్ష అందుకే: వెంకయ్య రాజీనామా చేయాలంటూ వీహెచ్ ఆసక్తికరం
Recommended Video
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలను మోసం చేసిందని సీఎం చంద్రబాబు నాయుడు కాదని, కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు.
విశాఖ వచ్చిన ఆయన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ, విదేశాల్లో ప్రతిష్ట కోల్పోయిందని అన్నారు.
బీజేపీ దీక్షలు: సీపీఎం నేతల రాకతో ఘర్షణ, ఉద్రిక్తత, బాబుపై జీవీఎల్ నిప్పులు, 'టీడీసీ' అంటూ ఎద్దేవా
చంద్రబాబు దీక్ష అందుకే
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, ఆ తర్వాత ఆ హామీని తుంగలో తొక్కారని వీ హనుమంతరావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించడానికే చంద్రబాబు నిరాహార దీక్ష చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు దీక్ష జాతీయస్థాయిలో మంచి ఫలితాలు సాధిస్తుందని అన్నారు.
వెంకయ్య రాజీనామా చేయాలి
ఏపీ ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్యనాయుడికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ఉపరాష్ట్రపతి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెంకయ్య రాజీనామా చేస్తే.. మోడీ, అరుణ్ జైట్లీకు భయం కలుగుతుందన్నారు.
కేంద్రం నిర్లక్ష్యంతో..
దేశంలో నగదు కొరత ఏర్పడిందని, అన్ని ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయని వీహెచ్ అన్నారు. నగదు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ సమస్య వచ్చిందని దుయ్యబట్టారు.
జీవీఎల్ వ్యాఖ్య నిజమవుతాయా?
కాగా, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తుందని ఇటీవల బీజేపీ నేత జీవీఎల్ నర్సింహారావు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు వీహెచ్ మద్దతుగా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.