సభ నుంచి వీహెచ్ సస్పెండ్: సవరణను స్వాగతించిన కెకె
న్యూఢిల్లీ: రాజ్యసభలో బుధవారం కూడా విపక్ష సభ్యుల ఆందోళన కొనసాగింది. మత మార్పిడుల అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ వి హనుమంతరావును ఒక రోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
విభజన చట్టంలో సవరణలు స్వాగతించిన కెకె
విభజన చట్టంలో సవరణలను స్వాగతిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు అన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సవరణలు తెస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొనడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
వివాదాలకు తావులేకుండా విభజన చట్టంలో సవరణలు జరగాలని అన్నారు. తెలంగాణ రాజ్యసభ సభ్యులను ఆంధ్రప్రదేశ్కు మార్చడం వల్ల ఎంపీ లాడ్స్ నిధులు ఖర్చు చేయడంలో సమస్యలు వస్తాయని అన్నారు. ఎంపీల మార్పుపై విభజన చట్టంలో సవరణలు జరగాలని కేశవరావు కోరారు. విభజన చట్టంలో సవరణలపై ప్రజలకు ఆందోళన అవసరం లేదని అన్నారు.
సవరణలపై వివరించాలని కోరిన కమల్నాథ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లులో సవరణలపై కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి కమల్నాథ్ పార్లమెంటులో ప్రభుత్వం వివరించాలని కోరారు. బిల్లులో ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారో తెలపాలని కోరారు. బిల్లు ఆమోద సమయంలో పూర్తి మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మార్చాలంటూ ఖ్యాతి కోసం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.