తిప్పుకున్నాడు: కిరణ్పై విహెచ్, ఏం చేద్దామని... డిగ్గీ
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆఖరి బంతి పేరుతో అందరినీ తన చుట్టు తిప్పుకున్నారని కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు సోమవారం అన్నారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీకి ఇంకా కార్యకర్తలు ఉన్నారన్నారు. పార్టీ నుండి దొంగలు బయటకు వెళ్తే తమకు అవకాశం వస్తుందని కార్యకర్తలు ఎదురు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
తాను రేపటి నుండి వరంగల్ జిల్లాలో పర్యటిస్తానని, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని గ్రామగ్రామాన చెబుతానన్నారు. కిరణ్ అబద్దాలు చెప్పి సీమాంధ్రులను మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ విషయంలో సోనియా ఎప్పుడు మాట మార్చలేదన్నారు. కిరణ్కు సొంత జిల్లాలోనే పట్టు లేదని, ఆయన వెంట ఎవరు వెళ్లడం లేదన్నారు.
విజయోత్సవాలు జరుపుకునే హక్కు లేదు: పొన్నం
రాష్ట్రంలో, కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షాలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు తెలంగాణ విజయోత్సవాలు జరుపుకునే హక్కు లేదని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు.
చందా ఇస్తా: డిఎల్
కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే తాను చందా ఇస్తానని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. రెండు రోజుల్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు.
సీమాంధ్ర ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు
మరోవైపు, సీమాంధ్ర ముఖ్య నేతలందరూ వెంటనే ఢిల్లీ రావాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సూచించారు. వచ్చిన వెంటనే రేపు అందరితో దిగ్విజయ్ భేటీ కానున్నారు. కొత్త ముఖ్యమంత్రి నియామకం, ప్రభుత్వం ఏర్పాటుపై పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో అయన చర్చోపచర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి పాలన లేక ప్రభుత్వ ఏర్పాటుపై రేపు నిర్ణయం తీసుకోనున్నారు. డిగ్గీతో కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజులు కూడా భేటీ అయ్యారు.