ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి ... టీకా వల్లే అంటున్న బాధిత కుటుంబం
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ఎక్కువ శాతం సానుకూల ఫలితాలు వస్తున్నప్పటికీ, కొంతమందిలో మాత్రం ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. కరోనా వ్యాక్సిన్ ప్రతికూల ప్రభావం ఎవరిపై చూపిస్తుంది అనేది మాత్రం అర్థం కావడం లేదు. తాజాగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాలంటీర్ మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
Recommended Video
శ్రీకాకుళం జిల్లాలో వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటలో 28 సంవత్సరాల వయసున్న పిల్లా లలిత అనే మహిళ మృతి చెందింది. వ్యాక్సిన్ వికటించడం వల్ల తమ బిడ్డ మృతి చెందిందని తల్లి దండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన లలిత తో పాటు ఎనిమిది మంది వాలంటీర్లు, స్థానిక వీఆర్వో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అప్పటి నుంచి అందరికీ స్వల్పంగా జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. లలితకు ఆ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో ఇంట్లోనే ఉంటూ టాబ్లెట్లు వేసుకున్నారు. అయినప్పటికీ లలిత మృతి చెందారు.
లలితతో పాటు వ్యాక్సిన్లు తీసుకున్న మిగతా వాలంటీర్లలో ఆందోళన
లలిత మృతితో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మిగతా వాలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో వారిని పలాస పీహెచ్సీ లో చేర్పించి వైద్య చికిత్సను అందిస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఇక లలిత మృతిపై పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత అసలేం జరిగిందో వెల్లడిస్తామని తహసిల్దార్ చెబుతున్నారు. ప్రస్తుతం లలిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పలాస కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు.
వ్యాక్సిన్ తీసుకోవటం వల్లే లలిత మృతి .. కన్నీరుమున్నీరు అవుతున్న తల్లిదండ్రులు
వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత లలితకు జ్వరం వచ్చిందని, మెడికల్ సిబ్బందికి తెలియజేస్తే పారాసిటమాల్ వేసుకోవాలని చెప్పారని, పారాసిటామాల్ టాబ్లెట్ వేసుకున్న ప్పటికీ, అప్పటికే బాగా నీరసించిపోయిన లలిత తెల్లవారేసరికి మరణించిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. లలితకు ఇతర అనారోగ్య సమస్యలు ఏవీ లేవని, కేవలం వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే లలిత చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లలిత తల్లిదండ్రులు.
బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయలు ప్రకటించిన మంత్రి సిదిరి అప్పలరాజు
వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ లలిత మృతి చెందిన వార్త తెలుసుకున్న మంత్రి సిదిరి అప్పలరాజు పలాస కమ్యూనిటీ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడే తక్షణ సాయం కింద రెండు లక్షల రూపాయలను ప్రకటించారు మంత్రి సిదిరి అప్పలరాజు .
ఇంకా లలిత మృతికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది .