తిరుమలతో పెట్టుకుంటున్నారు..వెంకటేశుడే చూసుకుంటాడు: ఇది మురాసురుడి పాలన: చంద్రబాబు
అమరావతి: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆలయాన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్ను ధరించడం, శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి ప్రొటోకాల్కు అనుగుణంగా ఆలయ ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. తిరుమలలో ఉత్తరద్వారం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. 10 రోజుల పాటు ఉత్తరద్వారం తెరిచే ఉంటుంది.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగ శుభాకాంక్షలు చెప్పడంలోనూ ఆయన జగన్ సర్కార్పై విమర్శలు సంధించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనను రాక్షస పాలనగా అభివర్ణించారు. రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించడానికి శ్రీమహా విష్ణువు వైకుంఠం నుంచి భూమికి దిగి వచ్చి మురాసురుడిని వధించాడని అన్నారు.
ప్రస్తుత రాక్షస పాలన నుంచి అలాంటి విముక్తి లభించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు కోరుకున్నారు. ప్రభుత్వం తిరుమల వెంకటేశునితో పెట్టుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల సంగతి ఏమిటో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడని చెప్పారు. తిరుమల ప్రతిష్ఠ, పవిత్రత మంటగలిసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. వారి సంగతిని దేవుడే చూసుకుంటాడని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి నారా లోకేష్ కూడా రాష్ట్ర ప్రజలకు వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
Recommended Video
ఒక సామాన్యుడిగానే సాటి మనిషికి సేవచేసిన ఏసుక్రీస్తు దేవుడు అయ్యాడని, కష్టాల్లో ఉన్న వారిని అక్కున చేర్చుకోవాల్సిన అవసరం గురించి జీసస్ ఈ సమాజానికి బోధించాడని అన్నారు. సమాజానికి, ప్రజలకు సేవ చేయడానికి ఎలాంటి అధికారాలు అవసరం లేదనే విషయాన్ని నిరూపించిన మానవతామూర్తి క్రీస్తు అని పేర్కొన్నారు. సహనం, క్షమాగుణాలు ఎంత గొప్పవో చెప్పడానికి తన రక్తాన్ని చిందించిన క్రీస్తు జన్మదినం పవిత్రమైన రోజు అని అన్నారు.