వైకుంఠ ఏకాదశి: తిరుమలలో భక్త కోటి (ఫోటోలు)
తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్త కోటీ పోటెత్తింది. వైకుంఠ ఏకాదశి శుభగడియల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్ని ఏర్పాట్లు చేసింది.
తిరుమలలో ఎక్కడ చూసినా భక్తుల క్యూలైన్లు దర్శనిమిస్తున్నాయి. వైకుంఠ ఏకాదశికి 24 గంటల ముందే భక్తులను క్యూలైన్లలోకి అనుమతి ఇచ్చారు. ఎన్నడూ లేని విధంగా సామాన్య భక్తులు వేచి ఉండేందుకు ప్రత్యేక క్యూలైన్లు నిర్మించారు.
భక్తలు సౌకర్యార్థం క్యూలైన్లకు ఇరువైపులా ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించారు. భక్తులకు ఎప్పటికప్పుడు మజ్జిగ ప్యాకెట్లు, పాలు, కాఫీ, టీ, తాగునీరు అందే విధంగా ఏర్పాట్లు చేశారు. మొదటి, రెండవ వైకుంఠం క్యూకాంప్లెక్స్ లు భక్తులతో నిండిపోయాయి.
ఆదివారం నుంచి కిటకిట
మొదటి వైకుంఠం క్యూకాప్లెక్స్ లోని 16 కంపార్ట్ మెంట్లు, రెండవ వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకే నిండిపోయాయి.
నిత్యాన్నప్రసాదం
క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్ లో వేచి ఉన్న భక్త కోటికి ఎప్పటికప్పుడు నిత్యాన్నప్రసాదాలు అంధించారు.
భారీ ఎల్ ఈడీ స్క్రీన్లు
తిరుమలలో క్యూకాంప్లెక్స్ లతో పాటు పలు ప్రాంతాల్లో భారీ ఎల్ ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఎస్వీబీసీ కార్యక్రమాలు ప్రసారం చేశారు. భక్తులు కార్యక్రమాలు తిలకిస్తూ గోవిందనామాలు పఠించారు.
ప్రత్యేక అలంకరణతో దేవాలయం
వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుమల దేవాలయాన్ని వివిద రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు.
గోవిందా హరి గోవిందా
తిరుమలలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా తయారు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి,అమ్మవార్ల కటౌట్లు ఏర్పాటు చేశారు.
గట్టి నిఘా
ప్రతి క్యూలైన్ లో అధికారులు ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తిరుమలలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలలోని దృశ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించారు.
మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు
అనంతపురం రేంజ్ డీఐజీ సత్యనారాయణ, తిరుమల అర్బన్ జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ నేతృత్వంలో మెటల్ డిటెక్టర్లు, స్కానింగ్ యంత్రాలతో తనిఖీలు చేస్తున్నారు.
శుభ్రత కోసం 3,500 మంది సిబ్బంది
భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండ పారిశద్ద్యం నిర్వహణ కోసం 3,500 మందిని నియమించారు. ఎప్పటికప్పుడు క్యూలైన్లు శుభ్రం చేస్తున్నారు.
టీటీడీ ఉద్యోగుల కోసం
వైకుంఠ ఏకాదశి సందర్బంగా టీటీడీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అవకాశం కల్పించారు. సోమవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు, మంగళవారం ద్వాదశిలో సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు స్వామివారిని దర్శించుకోనున్నారు.