వైష్ణవి మృతి: ముగ్గురి పరిస్థితి విషమం (పిక్చర్స్)
హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాద ఘటనలో ఆరోగ్యం కుదుటపడ్డ ఇద్దరు చిన్నారులను యశోదా ఆస్పత్రి వైద్యులు బుధవారం డిశ్చార్జ్ చేశారు. ఇంకా చికిత్స పొందుతున్నవారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన సందర్భంగా యశోదా ఆస్పత్రివద్ద డాక్టర్ మారుతి మీడియాతో మాట్లాడారు.
ఆరోగ్యం కుదుటపడ్డ చిన్నారులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయడం తమకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. పిల్లలు ఆస్పత్రికి వచ్చినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత ఆత్రుతకు గురయ్యారో తాము కూడా అంతే ఆవేదనకు గురయ్యామని డాక్టర్ మారుతి అన్నారు.
ఇక్కడ చిన్నారుల చికిత్స కోసం అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉండి చికిత్స అందించారని ఆయన చెప్పారు. నలుగురు విద్యార్థులు మినహా మిగిలిన చిన్నారులంతా ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని డాక్టర్ తెలిపారు.
ఇప్పటి వరకు 12 మంది విద్యార్థులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని, మరో ముగ్గురు విద్యార్థులు ప్రశాంత్, వరుణ్, తరుణ్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. దర్శన్, ఫాతిమా, నితూషాలు చికిత్స పొందుతున్నారని డాక్టర్లు చెప్పారు.
వైష్ణవి మృతి
మాసాయిపేట రైలు ప్రమాదంలో గాయపడిన యశోద ఆస్పత్రిలో చేరిన చిన్నారి వైష్ణవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.
శోకసముద్రంలో వైష్ణవి కుటుంబ సభ్యులు
వైష్ణవి మృతితో ఆమె కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. వారి బాధ వర్ణనాతీతంగా ఉంది.
శోకసముద్రంలో వైష్ణవి కుటుంబ సభ్యులు
యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాసాయిపేట రైలు ప్రమాదంలో మరణించిన వైష్ణవి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఈ ఆవేదన తీరేది కాదు..
వైష్ణవి తల్లిదండ్రులు కంటికీ మింటికీ ఏకధారగా విలపించారు. వారిని ఓదార్చడానికి బంధువులు విశ్వప్రయత్నమే చేశారు.
గాంధీ ఆస్పత్రిలో వైష్ణవి శవం
వైష్ణవి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.