చీకట్లో ఫలితాల తారుమారు సాధ్యమా ? జనాలు నవ్వుతారన్న సిగ్గు లేదా బాబు .. వల్లభనేని కౌంటర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత, పంచాయతీ ఎన్నికలలో వైసిపి అక్రమాలకు పాల్పడిందని , పవర్ కట్ చేసి, అర్ధరాత్రి కౌంటింగ్ చేసి, ఫలితాలను తారుమారు చేసి వైసిపి మద్దతుదారులను విజేతలుగా ప్రకటించిందని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబు ఓడిపోవడంతో కుంటిసాకులు వెతుకుతున్నారు
చంద్రబాబు తీరు ఏడవలేక మద్దెల దరువు అన్నట్టుగా ఉందని ఆక్షేపించారు వల్లభనేని వంశీ మోహన్ . ఈ ఎన్నికల దెబ్బకు తెలుగుదేశం పార్టీ కుప్పకూలిపోయినట్లేనని పేర్కొన్న వల్లభనేని వంశీ , గెలిస్తే అంతా తన గొప్పతనం అని చంద్రబాబు చెప్పుకుంటారు అని , ఓడిపోవడంతో కుంటిసాకులు వెతుకుతున్నారు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని వల్లభనేని వంశీ పేర్కొన్నారు. చీకట్లో ఓట్లు లెక్కింపు ఫలితాలు తారుమారు చేయడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు వంశీ.
చంద్రబాబు గెలిచిన పంచాయతీలు పుచ్చలపల్లి సుందరయ్య మార్గంలో గెలిచారా ?
ఒకవేళ అలా జరిగితే అక్కడ ఉండే ఇతర పార్టీల వాళ్ళు, మీడియా ,సోషల్ మీడియా చూస్తూ ఊరుకుంటాయా అంటూ ప్రశ్నించారు. ఎన్నికలలో ప్రజలను ఎవరు మభ్యపెట్ట లేరని, చంద్రబాబు ఓటమికి ఏదో చెప్పాలి కాబట్టి, దొంగే దొంగ అన్న చందంగా ఏదేదో చెబుతున్నారని వంశీ పేర్కొన్నారు . చంద్రబాబు వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారన్న వంశీ గెలిచిన పంచాయతీలు పుచ్చలపల్లి సుందరయ్య దారిలో ఏమైనా చంద్రబాబు గెలిచారా అంటూ ప్రశ్నించారు .
డబ్బు రాజకీయం మొదలెట్టింది నువ్వు కాదా చంద్రబాబూ ..?
అసలు డబ్బు రాజకీయం మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్నించారు వంశీ. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని చెప్పుకుంటున్న చంద్రబాబు జనాలు నవ్వుతారనే సిగ్గు కూడా లేకుండా వంకలు చెప్పటం నేర్చుకున్నాడు అని వల్లభనేని వంశీ మండిపడ్డారు. ఇదే సమయంలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆశిస్తున్నట్లు నామినేషన్ల పునరుద్ధరణ సాధ్యం కాదన్నారు వల్లభనేని వంశీ. ఆయా స్థానాలలో గెలిచిన అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంటుందని వల్లభనేని వంశీ అభిప్రాయపడ్డారు.