మహిళలపై ఘోరమా, ఎన్కౌంటర్ చేయాలి: వంశీ ఆవేశం, 'కాల్ మనీ'లో కొత్త కోణం
విజయవాడ: తెలుగుదేశం పార్టీ యువనేత వల్లభనేని వంశీ బుధవారం నాడు కాల్ మనీ దందా పైన స్పందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాల్ మనీ దందాను ఖచ్చితంగా అరికడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాల్ మనీ పేరుతో మహిళల పైన దారుణ ఆకృత్యాలకు పాల్పడుతున్న వారిని ఎన్కౌంటర్ చేసినా తప్పులేదని ఆయన ఆవేశంగా వ్యాఖ్యానించారు. కాల్ మనీ నిర్వాహకుల పైన సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే.
వ్యవస్థల నాశనానికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే పునాది పడిందని ఏపీ టీడీపీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణును అరెస్టు చేయాలని జగన్ ఎందుకు డిమాండ్ చేయడం లేదన్నారు.
విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ సెలవును ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన తన సెలవును రద్దు చేసుకొని విధుల్లో ఉండేందుకు నిర్ణయించుకున్నారని చెప్పారు. కాల్ మనీ పైన ప్రభుత్వం సీరియస్గా ఉందన్నారు.
మంగళవారం మంత్రులు గంటా శ్రీనివాస రావు, పత్తిపాటి పుల్లారావు, డొక్కా మాణిక్య వరప్రసాద్ రావులు ప్రతిపక్ష నేత జగన్ పైన మండిపడ్డారు. వైయస్ మరణం వెనుక చంద్రబాబు ఉన్నారని జగన్ చెప్పడం హాస్యాస్పదమని గంటా అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ గతే పడుతుందని పత్తిపాటి అన్నారు. జగన్కు చిత్తశుద్ధి లేదని డొక్కా అన్నారు.
కాల్ మనీలో కొత్త కోణం
కాల్ మనీ దందాలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఇప్పటికే బలవతంగా అధిక వడ్డీని తీసుకోవడం, బలవంతంగా భూములు రిజిస్ట్రర్ చేయించుకోవడం, ఆభరణాలు తీసుకెళ్లడం, ఇళ్లు రాయించుకోవడం, మహిళలను వ్యభిచార వృత్తులోకి దింపడం చేస్తోన్న విషయం తెలిసిందే.
తాజాగా, మరో కొత్త కోణం వెలుగు చూసింది. కాల్ మనీ నిర్వహాకులు అప్పు ఇవ్వకుండానే ఇచ్చినట్లు... కొందరి నుంచి బలవంతంగా డబ్బులు తీసుకుంటున్నారు. సత్యనారాయణ అనే వ్యక్తి నుంచి కాల్ మనీ నిర్వాహకులు అప్పు ఇవ్వకుండానే.. ఇచ్చామని చెప్పి బలవంతంగా పొలం, బ్యాంకులోని నగదును అటాచ్ చేయించుకున్నారు. బాధితుడు టాస్క్ ఫోర్స్ను ఆశ్రయించాడు.