వంశీ తేల్చిచెప్పేసారు.. : సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక: ముహూర్తం ఇదే..!
కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు కారణమైన గన్నవరం ఎమ్మెల్యే ఎట్టకేలకు తన నిర్ణయం ఏంటో తేల్చేసారు. ఇక, టీడీపీలో ఉండనని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేస్తూ లేఖ పంపిన వంశీ ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలతో ఆయన వైసీపీలోకి మారుతారా లేదా అనే చర్చ మొదలైంది. అదే సమయంలో బీజేపీ నేతలు సైతం వంశీ తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు సీనియర్ నేతలను వంశీతో రాయబారం కోసం నియమించారు. కానీ, వారికి వంశీ అందుబాటులోకి రాలేదు.
వంశీ పైన పెట్టిన కేసుల విషయంలోనూ చంద్రబాబు వేధింపుల కోసమే పెట్టారని..వంశీ ఏం తప్పు చేసారని ప్రశ్నించారు. దీంతో..రెండు రోజులుగా హైదారాబాద్ లో ఉన్న వంశీ ఇప్పుడు తన రాజకీయ అడుగుల పైన స్పష్టత ఇచ్చేసారు. తాను టీడీపీ వీడుతున్నట్లుగా తేల్చి చెప్పిన ఆయన..వైసీపీలో చేరుతున్నానని..ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటానని తేల్చి చెప్పారు. అందుకు ముహూర్తం సైతం ఫిక్స్ చేసుకున్నారు.
బాలకృష్ణ వియ్యంకుడి భూకేటాయింపులు రద్దు: అమ్మఒడి..రూపాయి రిజిస్ట్రేషన్ కు ఏపీ కేబినెట్ ఆమోదం..!
3 లేదా 4న వైసీపీలోకి వంశీ..
గత వారం ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన తరువాత వంశీ ఖచ్చితంగా వైసీపీలో చేరుతారని అందరూ అంచనా వేసారు. టీడీపీ వంశీ పార్టీ మార్పును అడ్డుకొనేందుకు ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే, వంశీ మాత్రం వైసీపీలో చేరాలని డిసైడ్ అయిపోయారు. అందుకోసం ముహూర్తం సైతం ఫిక్స్ చేసుకున్నారు.
నవంబర్ 3 లేదా 4వ తేదీన ఆయన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వంశీ తన సన్నిహితులకు స్పష్టం చేసారు. పదవుల కోసం తాను పార్టీ మారటం లేదని.. అనుచరుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని వంశీ చెబుతున్నారు. అయితే, వైసీపీ వేధింపులకు గురి చేస్తుందంటూ చంద్రబాబుకు పంపిన వాట్సప్ లేఖలో వంశీ ప్రస్తావించటం ద్వారా ఆయన వైసీపీలో చేరుతారా లేదా అనే చర్చ సైతం సాగింది. అయితే, చివరకు ఆయన ఇక వైసీపీలోనే చేరాలని నిర్ణయించుకున్నారు.
హైదరాబాద్ కేంద్రంగా మంతనాలు..
వంశీ రెండు రోజులుగా హైదరాబాద్ లో మకాం వేసారు. టీడీపీ అధినేత ఎలాగైనా వంశీని పార్టీ మారకుండా అడ్డుకొనేందుకు ఆయన కోసం ఇద్దరు సీనియర్ నేతలను రాయబారానికి ఎంపిక చేసారు. అయితే, వంశీ వారితో ఈ అంశం మీద చర్చించేందుకు నిరాకరించారు. ఇదే సమయంలో వంశీ మీద చంద్రబాబు పరోక్షంగా ఒత్తిడి పెంచారు.
వంశీ ఏ తప్పు చేయకుండా కేసులు పెట్టారని..ఆయనకు మద్దతుగా పార్టీ నిలబడుతుందంటూ చెప్పుకొచ్చారు. కానీ, చంద్రబాబు నిర్వహించిన జిల్లా సమీక్షకు వంశీ హాజరు కాలేదు. ఇదే సమయంలో హైదరాబాద్ లో ఉన్న వంశీతో వైసీపీ ముఖ్య నేత నిరంరతం టచ్ లో ఉన్నారు. ఆయనకు హైదరాబాద్ లో ఎదుర్కొంటున్న ఒక భూమికి సంబంధించిన వ్యవహారం లోనూ వంశీకి అనుకూలంగా వైసీపీ నేతలు నిలబడినట్లు సమాచారం. దీంతో..వైసీపీ నేతలతో తుది చర్చల తరువాత ఆయన వైసీపీలో చేరేందుకు ముమూర్తం నిర్ణయించుకున్నారు.
గన్నవరంలో ఉప ఎన్నిక ఎప్పుడు..
ఇక, గన్నవరం నుండి ఎమ్మెల్యేగా ఉన్న వంశీ వైసీపీలో చేరటం ఖాయమవ్వటంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. అందుకు వంశీ సైతం సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన టీడీపీ అధినేతకు ఈ సమాచారం ఇవ్వగా..అధికారికంగా స్పీకర్ ఫార్మాట్ లో లేఖ పంపాల్సి ఉంది. వైసీపీలో చేరే ముందు ఆయన రాజీనామా చేయనున్నారు. అయితే, ఆమోదం పైన నిర్ణయం మాత్రం స్పీకర్ తీసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమంత్రి జగన్ ఆలోచనల మేరకు రాజనీమా ఆమోదం పైన నిర్ణయం ఉండే అవకాశం ఉంది. అయితే, సార్వత్రిక ఎన్నికలు జరిగి ఆరు నెలలు కూడా కాకుండానే.. మరోసారి ఎన్నికలు అంటే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో..గన్నవరం ఎన్నిక ఇప్పట్లో ఉండే అవకాశం లేదని సమాచారం.