వల్లభనేని వంశీ తప్పటడుగు వెయ్యడు...నాకు టచ్ లో ఉన్నాడు: సుజనా ఆసక్తికర వ్యాఖ్యలు
వల్లభనేని వంశీ మోహన్ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని అందరూ భావించినా ఆయన ఇంకా వైసిపీలో చేరలేదు . ఇక తాజాగా బిజెపి ఎంపీ సుజనాచౌదరి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వంశీ తనకు టచ్ లోనే ఉన్నారన్న సుజనా చౌదరి
వల్లభనేని వంశీ చాలా తెలివి కలవాడని, ఎప్పుడు రాంగ్ స్టెప్ వేయడు అని సుజనా చౌదరి పేర్కొన్నారు. ఇప్పటికీ వల్లభనేని వంశీ తనకు టచ్లోనే ఉన్నారని సుజనా చౌదరి పేర్కొన్నారు . తెలుగుదేశం పార్టీలో ల్లభనేని వంశీ పడిన ఇబ్బందులను గురించి తనకు తెలియదన్నారు సుజనా చౌదరి. తనను చాలా సందర్భాల్లో కలిశారని చెప్పిన సుజనా చౌదరి వంశీ కలిసిన సందర్భంలో ఏం చెప్పారో మాత్రం చెప్పలేదు .
తొందరపడి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదన్న సుజనా
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడానికి ముందు తనను కలిసి చర్చించారని, రాజీనామా చేసిన తర్వాత కూడా తనతో మాట్లాడారని సుజనా చౌదరి పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వల్లభనేని వంశీ చేరుతారని చెప్పిన విషయం తనకు మీడియా ద్వారానే తెలుసు అన్న సుజనా చౌదరి , ఆ తర్వాత కూడా వంశీ తనతో మాట్లాడారన్నారు. వంశీ తనకు మొదటి నుంచీ తెలుసని, తొందరపడి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదని పేర్కొన్నారు. ఇంకా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు కాబట్టి ఆయన తప్పు నిర్ణయం తీసుకోరు అని సుజనా చౌదరి పేర్కొన్నారు.
సరైన సమయంలో సరైన నిర్ణయం వంశీ తీసుకుంటారని ఎంపీ ఆశాభావం
తెలుగుదేశం పార్టీలో తాను ఏమీ ఇబ్బంది పడలేదు అని చెప్పిన సుజనా చౌదరి పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ తాను టిడిపికి రాజీనామా చేసి, బిజెపిలో చేరానని పేర్కొన్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పలు సందర్భాల్లో తన వృత్తి పరమైన, వ్యక్తిగతమైన విషయాలను కూడా తనతో పంచుకున్నారని, కానీ పార్టీలో ఇబ్బందులు ఎప్పుడు చెప్పలేదన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు సుజనా చౌదరి.
జాతీయ పార్టీ వైపు మొగ్గు చూపుతారని ఆసక్తికర వ్యాఖ్య
ఆయన కచ్చితంగా జాతీయ పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. టిడిపిలో వంశీకి కలిగిన ఇబ్బందిపై తనతో ఏం మాట్లాడలేదని చెప్పిన సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ పై వల్లభనేని వంశీ చేసిన విమర్శలు తనకు నచ్చలేదని పేర్కొన్నారు. ఏదేమైనా వల్లభనేని వంశీ ఇంకా ఏ పార్టీలో చేరలేదు కాబట్టి బిజెపిలో చేరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు సుజనాచౌదరి. ఇటీవలే ఆయన వై సీపీ నేతలు బీజేపీకి టచ్ లో ఉన్నారని బాంబ్ పేల్చారు. ఇక తాజాగా వల్లభనేని వంశీ వైసీపీలో కాకుండా బీజేపీలో చేరతారా అన్న అనుమానాలకు తావిచ్చేలా వ్యాఖ్యలు చేశారు.